పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/443

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రచించెను. అందలి గద్యలో 'శ్రీ శివాజీ మహీపాలుని తెలుఁగుకవి వెంకట కృష్ణాజెట్టి' యని వ్రాసుకొని యుండుటవలన, శివాజీ కొంతమంది సంస్కృత కవులను గూడ పోషించినట్లు ద్యోతకమగుచున్నది.

ఈ మహారాష్ట్ర నాయకుల పరిపాలనకాలమున సేనాపతులనేకులు వాఙ్మయాభిలాషులై వర్తించిరి. అట్టివారిలో ఖండోజీ యొకడు. ఇతడే మహారాష్ట్ర నాయకుని సేనాపతియో ప్రత్యేకముగా తెలియదు. ఇతడు కలిగిరి యను కవిని పోషించి రుక్మాంగద చరిత్రమను నేకాదశీ మాహాత్మ్యమును తెనుగున ద్విపదకావ్యముగ రచియింపజేసెను. ఈ కలిగిరి వెనుక శాహజీ కాలమున చెప్పబడిన శ్రీగిరికవి వంశజుడు.

మహారాష్ట్ర నాయకుల కాలమున వెలసిన ఆంధ్రవాఙ్మయమును సింహావలోకన మొనర్చినచో, వీరి కాలమున 'నాటక వాఙ్మయము' హెచ్చుగా నభివృద్ధి జెందినటుల కన్పించును. ఈ నాటకములు సంస్కృత వాఙ్మయము నందలి నాటకములతో నెట్టి సంబంధమును లేక సర్వస్వతంత్రములైనవి. 'ప్రతిభ' శిశిరసంచికలో శ్రీయుత చింతా దీక్షితులుగారు యక్షగానము లను శీర్షిక క్రింద ఆంధ్రనాటకముల యభివృద్ధిని గూర్చి విపులముగా చర్చించి యున్నారు. ఆంగ్ల నాటకములు గ్రీకు నాటక సంపర్కము లేకుండా సర్వస్వతంత్రముగా ఒపేరాల (Operas) నుండి పుట్టినట్లుగా నాంధ్ర నాటకములు తోలుబొమ్మలాట నుండి పుట్టినవి.

మహారాష్ట్రు లన్యదేశీయులైనను ఆంధ్రభాషను గౌరవించి పోషించిరన్నచో తెలుగుభాష తేనెతెరలవంటి దగుటయే గాక, దానికి గల శ్రవణపేయమగు శబ్దమాధుర్యము (Euphony) ఏ యితర దాక్షిణాత్య భాషలకు లేకపోవుటయే ముఖ్యకారణము. కావుననే కర్ణాటాధిపతియగు కృష్ణరాయలు 'దేశ భాషలందు తెలుగు లెస్స' యని పొగడియున్నాడు.

చ. జనని సమస్తభాషలకు సంస్కృతభాష ధరాతలంబునన్
     ఘనలలితార్థ గౌరవిభాసి తెనుం గభిరమ్యమంతకున్
     గనుగొనఁ జాతబీజమున కంటెను గోమలపత్త్రపుష్ప శో
     భనమృదుపల్లవాభినవ బాలరసాలము సొంపు నింపదే !

(శ్రీ పర్వత పురాణకర్త)


- ఆంధ్రపత్రిక బహుధాన్య సంవత్సరాది సంచిక

____________________________________________________________________________________________________

సాహిత్య విమర్శ

443