పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వీనిని బాల్యచేష్టలుగఁ బరిగణించుటకు బదులుగఁ బెద్దలు కొందఱు జాడ్యచిహ్నములుగ లెక్కించిరి. వసంతభిషగ్వరుఁడున్నాఁడు కదా యని కొంద ఱూహించిరి. మఱికొందఱు 'మహానుభావులు' -

చ. “తెగిన మనోభవు న్దిరుగఁ దెచ్చి కుజంబుల కెల్లఁ బ్రాయమున్మ
     నుగడ నిచ్చి యన్యభృత మండలి మూఁగతనమ్ము వుచ్చి ము
     జ్జగముల వార్తకెక్కినవ సంతభిషగ్వరుఁ డాప్తుఁ డయ్యునున్
     దగు గతి మాన్పలేఁడ మఱి దక్షిణవాయువునందు జాడ్యమున్?"

అని నిశ్చయించి తీరినారు. ఇవి జాడ్యలక్షణములా? కావు. మారమాధవ కైంకర్యమునకై మలయానిలుఁడొనర్చు నున్మత్త కృత్యములు. వారు ప్రభువులై ప్రవర్తించి ప్రఖ్యాతి నొందఁ గలిగెడిది యాతఁ డిట్టియున్మాదకృత్యము లొనర్చిననాఁడే కదా! 'కారయితుః కర్తృత్వమ్.' ఇందలి దోషము లన్నియు నా మన్మథమాధవులనే!

విరహిణుల దృష్టిలో నితఁడు 'కాలాంతఃపురకామినీకుచ తటీకస్తూరికాసౌరభశ్రీ లుంటాకము; చందనాచలతటీ శ్రీఖండ సంవేష్టిత వ్యాళస్ఫారఫణాకఠోర విషనిశ్వాసాగ్ని పాణింధమము.’ ఇతనియందు శైత్యమున్నదా యనుశంక వొడమి యొక వియోగిని యన్వేషించినది. అంతకాశాసమాయాతత్వము, రౌద్రమూర్తిత్వవార్తలు, దహనసారథ్యతత్పరత, శ్రీఖండవిషధరోచ్ఛిష్టతలు నరసి, విచారించి, భావించి, ‘మలయపవన! నీ యందుఁ జలువగల దనునట్టి సంశయము తగదు. చండాలవాటిలో బ్రాహ్మణగృహముకై వెదకుట భ్రాంతి కదా!' యని యామె నిశ్చయించినది. వియోగాగ్నిని భరింపఁజాలక 'తలఁప జగత్రాణుఁడవై వెలసిన నీవిట్లు నన్ను వేఁచుట తగునే? చింతింప నిల వెలుగు చేను మేసిన నెద్ది కాఁ' పని యామె మలయానిలునితో మొఱపెట్టుకొనినది. అతని నుద్దేశించి :

ఉ. "దక్షిణగంధవాహ! నిను దన్మలయద్రుమరూఢగూఢపా
     దృక్షణనింత కంతయు నపాయము పొందదె పొందకుండఁగా
     నిక్షుశరాసనుండు విరహిశ్వసితోపచయక్రియ న్విము
     క్తక్షయుఁ జేసెఁ గావలయుఁ గాక తదుష్టత నుష్టమెక్కఁగన్.”

అని యుపాలంభించినది.

ఇంత కంటె జాణ యగు నొక విరహిణి మలయానిలుని రాకనే యరికట్ట నుద్దేశించి, యతని లోకయాత్రకు భంగకరమగు ననియైన నూహింపక - ____________________________________________________________________________________________________

44

వావిలాల సోమయాజులు సాహిత్యం-4