పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/439

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వారును అట్టివారే. కాబట్టి కందాళ వారిని బట్టి రాఘవాచార్యుని నివాసస్థానమును మనము నిర్ణయింపజాలము. బ్రహ్మశ్రీ శర్మగారు రాఘవాచార్యులు నలచరిత్రమున దత్తమండలపు మాండలిక పదముల నుపయోగించి యున్నాడని వ్రాసిరి. కాని నలచరిత్రమునందు గాని, విష్ణు భక్త చరిత్రమునందుగాని దత్తమండలములోని ప్రత్యేక పదములున్నట్లు కనుపింపవు. అట్టి మాటలన్నియు పూర్వ కవులు ప్రయోగించినవే. అదియును గాక రాఘవాచార్యుడు తన నలచరిత్రమున కందాళ దొడ్డయాచార్యుని ప్రస్తుతించెను. ఈ దొడ్డయాచార్యుని ప్రస్తుతించిన కవులందఱును తమిళ దేశమునందలి యాంధ్రకవులే గాని, యాంధ్ర దేశమునందలి యాంధ్రకవులుగా కన్పింపరు. కాబట్టి రాఘవాచార్యుని నివాసస్థానము తంజావూరు పాపనాశనము తాలూకా యని తేట తెల్లమయినది. రాఘవాచార్యుడు బాల్యము నంతయు తన జన్మస్థానమగు చక్రపురమునందే గడపి తరువాతి కాలమున తంజాపూరమును ప్రవేశించి తన పాండితీప్రకర్ష వలనను, సంగీత శాస్త్రజ్ఞానము వలనను ముద్దుపళనిని శిష్యురాలిగా బడయగలిగెను. ముద్దుపళని రాధికాసాంత్వనము నందలి సంస్కృతపద బాహుళ్య మంతయు రాఘవాచార్యుని సహాయమూలకమే. ఇతనికి ద్విపద కవిత్వమన్న నల్లేరుపై బండి. తిరుపతి ప్రాంతమువాడగుటవలన తాళ్ళపాకవారి అష్టమహిషీ కల్యాణము నందలి పదములనేకము లీతని విష్ణుభక్త చరిత్రమున13 గన్పట్టుచున్నవి. ఇతని కవిత్వము నిర్దుష్టము; అలంకార యుతము. కొద్దిపాటి దోషములున్నను త్రోసి వేయదగినవి. ఇతడు తన ద్విపద కావ్యములను కవిపామర జనవేద్యములుగా నొనర్చెను. పాల్కురికి సోమనాథ, రంగనాథాదు లెట్లు 'ద్విపద కావ్యంబు ముదికాంత దిడ్డికంత' యను నైచ్యభావమును బోగొట్టి కీర్తిపాత్రులైరో, యితడు నట్లే తన కావ్యమును నవరసభరితముగ, ప్రబంధ లక్షణములకు లోటు లేకుండ నన్ని వర్ణనల జక్కగ జేసి, మృదు మధురములగు పదములతో ద్రాక్షాపాకంబున రచించెను. ఇతడు తన నలచరిత్రమున పరదారాసక్తివలన గలుగు నష్టములు, వ్యసనాభిలాషవలన గలుగు కీడులు, బాతివ్రత్యము మొదలగు విషయములను జక్కగ పామరజన వేద్యములుగా రచియించెను.

తుళజ మహారాజు (క్రీ.శ. 1765-87)

ఇతని రాజ్యకాలమున సంస్కృతమున 'రామచంద్రశేఖర కవి' యనునతడు 'కళావతీనందక' మను కావ్యమును రచించెను. తుళజ మహారాజు సాహిత్యవేత్తగా కన్పించుచున్నాడు. ఆంధ్ర వాఙ్మయమునందీతని కాలమున ముఖ్యముగా పేర్కొనదగిన ____________________________________________________________________________________________________

సాహిత్య విమర్శ

439