కోరికపై పంచకన్యా పరిణయమను నాటకమును రచించితినని చెప్పుకొనెను. మహారాజీ నాటకము నాంధ్రభాషలో వ్రాయవలసినదిగా కోరెనట. కాబట్టి యీతడు మరి యితర భాషలలో గూడ కవిత జెప్పగలిగినాడని యూహించుట కవకాశము కలుగుచున్నది. శాహ మహారాజ రాజ్యకాలముననే లీలావతీశాహరాజీయ మను నాటకమునకు కర్తయగు బాలకవి సుబ్బన్నయను నొక కవిపుంగవుడు కన్పించుచున్నాడు. పై బాలకవియు, నీ బాలకవి సుబ్బన్నయు నొకడేమోయని తలంచుట కవకాశము కలుగుచున్నది గాని, యొక్కరే యని చెప్పుటకు తగినంత యాధారము లేవియు లేవు. బాలకవి సుబ్బన్న 'లీలావతీశాహ రాజీయ' మను గ్రంథమున 'సరికవు లెన్నునట్లుగా వ్రాసినాడ’ నని చెప్పుకొనెను. కాబట్టి బాలకవి సమకాలీనులలో పేరుగన్న వాడన్నమాట. 'శేషాచల పతి' యను మరి యొక కవి 'శాహ మహారాజ విలాస' మను నాటకమును రచించెను. ఇతడు తన నాటకమున 'అష్టభాషా కవిత్వంబులమరు' నని చెప్పియున్నాడు. ఇతని పాండితీ ప్రకర్ష నిరుపమానమని యీ నాటక రాజము చెప్పకయె చెప్పుచున్నది.
శరభోజీ (క్రీ.శ. 1711-28)
శాహ మహారాజు మరణానంతరము అతని తమ్ముడగు శరభోజీ రాజయ్యెను. ఇతడు శాహ మహారాజువలె పండితుడు కవి కాకపోయినను కవులను పోషించెను. ఇతని కాలమున గిరిరాజకవి కొంతకాలము జీవించియున్నట్లు పైన బేర్కొని యున్నాను. ఈతని పరిపాలనకాలముననే త్యాగరాజస్వామి జీవించి, తన గానామృతమును వెదజల్లినది. త్యాగరాజు తాను జీవద్భాషలో వ్రాసిన దివ్యమైన కృతులు గాక 'నౌకాచరిత్రము', 'ప్రహ్లాద చరిత్రము' అను రెండు యక్షగానములు గూడ రచించెను. త్యాగ రాజాంధ్రుడు, బ్రాహ్మణుడు, ములికినాటి వంశజుడు. శాంతాదేవి - రామబ్రహ్మల గర్భశుక్తిముక్తాఫలము. చోళ దేశమునందలి పంచనద గ్రామనివాసి. తిరువది గ్రామనివాసి యని శ్రీయుత జయంతి రామయ్యపంతులవారు వ్రాసియున్నారు. త్యాగ రాజస్వామి తన నౌకాచరిత్రమున 'కాకర్లాంబుధి చంద్రుడు శ్రీకరుడగు త్యాగరాజ చిత్తనివేశా' యని పేర్కొనుటవలన త్యాగరాజు గృహనామము కాకర్లవారని తెలియుచున్నది.' త్యాగరాజ స్వామి నౌకాచరిత్రమున తన గురువర్యుడు రామకృష్ణానందమును
కం. 'మ్రొక్కెద దేశికవరునకు,
మ్రొక్కెద ధర్మార్థ కామ మోక్షదునకు (?),
వావిలాల సోమయాజులు సాహిత్యం-4