పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/43

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వసంతవేళ మ్రాను పట్టుచున్నది; తలిరులు పుట్టుచున్నవి. ఈ విషమస్థితికిఁ గారణము 'రవి గాననిచోఁ గాంచు కవికి' గోచరించినది.

ఉ. “చిలువసుధారసాధరల చెల్వపుఁ బుక్కిటి తావిఁ దీయనై
    వలపులయందుఁ దత్ప్రియుల వక్త్రవిషజ్వలనోష్మ నెఱ్ఱనై
    వెలువడి తద్గుణద్వితయ వేధ సుమీ యన మ్రానుపట్టుటల్
    దలిరులు బుట్టుటల్ కనఁగఁ దార్కొనెఁ జందనశైలవాయువుల్.”

అని యొక కవిశ్రేష్ఠుఁడు తాఁగనిన సత్యమును బ్రకటించి సృష్టి నిర్మోకమును దొలఁగించి యొక రహస్యమును వెల్లడించినాఁడు.

'ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే యని కృష్ణభగవానుఁడు గీతలోఁ బ్రవచించినాఁడు. అతఁడేమిహికాఁ జలధుల మునిఁగిపోవు వన భువనము నుద్ధరింప మలయానిలుఁడై యవతరించినాఁడు. లేకున్న మిహికా జలధు లేమగుచున్నట్లను ప్రశ్నకుఁ దగిన సమాధానము రామి, విజ్ఞులిట్లు నిర్ణయించిరి. రాయలవారు ‘భువనవిజయము’న ‘నిండుపేరోలగంబుండి యొకపరి యష్టదిగ్గజముల నీ విషయమై పృచ్ఛయొనర్చిరి. సంతృప్తికరమగు సమాధానము రాకపోవుటచే నారాజకవి శిఖామణి యధ్యక్షపీఠము నుండి తామే యిట్లు ఛిన్న సంశయముగ సెలవిచ్చిరి.

కం. [1]"మలయకటకోటజస్థిత
      కలశీసుతసేవ నిట్లు కనెనొ తదాశా
      నిలుఁ డనఁగ నలసవృత్తిన
      మెలఁగుచు నాపోశనించె మిహికాజలధిన్.”

సకల జనానుమోదకరణదక్షుఁ డగు మలయానిలుని యవతారము లెన్నియైనఁ గలవు. అతఁడు 'చంచరీకంబురీతి వికచారవిందదీర్షికల వినోదించును; పర్జన్యుభాతి కుసుమితనవ లతావిసరంబులఁ గదలించి వలిదేనియలు సోనఁ దలము గొల్పును; ప్రణయవేళల సురటియై రంజిల్లును.

అప్పుడప్పుడు మలయానిలబాలుఁడు 'బొండుమల్లెల పరాగము రేఁచి నిబిడంబు సేసె వెన్నెలరసంబు, తుమ్మెదలకు నోగిరమ్ములౌ నలరుల కమ్మ తేనియ లెల్లఁ గ్రుమ్మరించె, కీరవారంబుల కారివేరంబుగా ఫలజాలముల నేల పాలు సేసె, దొరల నంటిన జాఱు తరుల నంటి పెనంగు నల లతకూనలఁ దొలంగఁద్రోసె, వనిఁ దమ

యిచ్ఛవర్తిలు ఖగములపై, బరాగములు సల్లె.'
  1. మలయ కటకో - ఆముక్త ఆ. 5

____________________________________________________________________________________________________

మణిప్రవాళము

43