స్వేచ్ఛను ప్రసాదించిన గ్రామములలో శాంతిస్థాపన మొనర్చి క్రమపాలనమును నెలకొల్ప మేజరు జనరల్ ఛటర్జీ వెనువెంట వచ్చుచున్నాడు.
కర్నలు మాలిక్ జాతీయ పతాకారోహణ మొనర్చుచు విజ్ఞాన శాఖను నడుపుచున్నాడు.
ఇంఫాలు నగరము కనుచూపు మేరలో నున్నది. అది శత్రువుల ప్రధాన స్థానము, అటనుండి వారు నేతాజీ సేన నెదుర్కొనుచున్నారు. వారి 14వ సైన్యము జాతీయ సైన్యధాటి కాగలేక రూపుమాసి పోవుచున్నది. శత్రువులు రక్షణ వ్యూహమును చక్రాకృతిగ నిర్మించుకొనినారు. ముందు టాంకులు, తరువాత ఫిరంగులు. ఆ వెనుక సేనయు నున్నది. వాయు విమానములపై నూతన సైన్యములు వచ్చి వారిని జేరుకొనుచున్నవి. కాని యేమి ప్రయో జనము? వారికి నైతిక బలము లేదు.
అయినను తప్పనిసరిగ ముందుకు సాగివచ్చినారు.
12 ఫిబ్రవరి 1944న సేనానాయకుడు షా నవాజ్ ఉత్తర బాల్మాలోని జపాను సైన్యాధ్యక్షునితో సంప్రదించినపుడాతడు జాతీయ సైన్యమునకు గావలసిన వాయు విమానములు, నాహార పదార్థముల నిత్తునని వాగ్దానము చేసినాడు. వాయు విమానములు రాలేదు. తినుటకు తిండియైన లేదు. కందమూలములు తినుచు మహారణ్యములలో నేతాజీ వీరులు నాయకుని యెడ నచంచల భక్తి విశ్వాసములతో ధైర్య సాహసములతో భయంకర యుద్ధములు గావించినారు.
శత్రువు నెదుర్కొనలేక జపనీయులే పారిపోవుచున్నారు. ఆకలిబాధల కోర్వలేక ఆజాద్ హిందు సేనలో ననేకు లాత్మహత్య జేసికొనినారు.
ఇట్టి క్లిష్టస్థితిలో ద్రోహులు కొందరు శత్రు పక్షముతో సంధి జేసికొని వారి కత్యావశ్యకములైన సమాచారము లందజేసినారు. దైవమును దాత్కాలికముగ వారి కనుకూలించినది - కుంభవృష్ణులు కురిసినవి.
స్థితిగతుల నవగత మొనర్చుకొని నేతాజీ తిరోగమింప సేనల నాజ్ఞాపించి నాడు. ఇందాతని యుద్ధవిశారదత్వ మంతయును వెల్లడియైనది.
తిరోగమనమున సేనలపారనష్టముల పాలైనవి. మనోవేగమున మండలే, మైమ్యోల వరకు జేరినవారికి మాత్రము విశ్రాంతి జేకూరినది. మిగిలినవారు శత్రువులకు జిక్కుటో, యాత్మహత్య గావించుకొనుటో జరిగినది.