Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/695

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అనేక ప్రఖ్యాత పురుషులు సభకు విచ్చేశారు. మానవజాతి మధ్య శాంతిని నెలకొల్పాలంటే సభలు జరపటం, వుపన్యాసాలివ్వటం, తీర్మానాలు చెయ్యటం కంటే ఇంకా మించిన పని ఏదయినా చెయ్యాలన్న విషయం స్పష్టపడింది. ఇందుకు మరొక మార్గమేదీ గోచరించకపోవటం వల్ల తన చేతిలో ఉన్న శక్తిమంతమయిన సాధనాన్ని ధనాన్ని ప్రయోగించటానికి నిశ్చయించాడు కార్నెగీ. అది ఆయన ఇతరాశయాలను సాధించడానికి అతిశక్తిమంతమయినదని రూఢిగా నిరూపిత మయింది. ధనాన్ని వెచ్చించటం వల్ల శాంతి లభించేటట్లయితే, అతడు దాన్ని నీరులా ప్రవహింప చేసేటందుకు నిశ్చయించుకున్నాడు.

అందువల్ల డిసెంబరు 14, 1910 నాడు అంతర్జాతీయ శాంతి కోసం కార్నెగీ ఎండోమెంటు అన్న ఒక నిధిని ఏర్పాటు చేశాడు. అతడు తలపెట్టిన వాటిలోకెల్లా ఒక్క ఈ విషయంలోనే అతనికి కొంత అపజయం కలిగింది. ధర్మకర్త సంఘానికి అధ్యక్షుడుగా అతడు ఎలహూటీన్ ఎన్నుకొన్నాడు. ఇతడంటే అతనికెక్కువ మక్కువ. ఇతణ్ణి ఎక్కువగా మెచ్చుకుంటుండేవాడు. కార్యక్రమాన్ని నిర్ణయించే పని నంతటినీ ధర్మకర్త వివేకానికి విడిచి పెట్టేశాడు.

ధర్మకర్తలు తమకు చేతనయినంత చేశారు. వారు కార్యకలాపాన్నంతటినీ మూడు శాఖలుగా విభజించారు. ఇందులో ఒక శాఖ "ది డివిజన్ ఆప్ ఇంటర్ కోర్స్ అండ్ ఎడ్యుకేషన్. ఇది అంతర్జాతీయ విధానాలను గురించిన భోగట్టాను సంపాదిస్తుంది. అంతర్జాతీయ సుహృద్భావాన్ని వృద్ధి పెంపొందించటం కోసం తగినన్ని ఏజెన్సీలను స్థాపించి వాటిని నడిపిస్తున్నది. ఇది వివిధదేశాలల్లో శాస్త్ర నిష్ణాతులయిన విద్వాంసులను, రచయితలను పరస్పరం వినిమయం చేసుకొనే ఏర్పాట్లు చేస్తుంది. ఏవైనా శాంతి సంస్థలు పూర్వమే ఏర్పడి వున్నట్లయితే వాటికి తగిన సహాయమిచ్చి తోడ్పడుతుంది. దీని ఆర్థిక - చరిత్రశాఖ, "ది డివిజన్ ఆఫ్ ఎకనమిక్స్ అండ్ హిస్టరీ." శాంతి సమరం అన్న రెండు విషయాలమీద తమ ప్రభావాన్ని నెరపుతున్న రాజకీయ, సాంఘిక, ఆర్థికకారణాల స్థితిగతులను గురించిన పరిశోధనలను చేస్తుంది. ఆయా రంగాలలో శాంతిదృష్ట్యా అనుసరించవలసిన మార్గాలను, కార్యక్రమాలను సూచిస్తుంది. అంతర్జాతీయ న్యాయశాఖ "ది డివిజన్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా" వివిధదేశాల న్యాయశాస్త్రాలను పరిశీలించి, అంతర్జాతీయ న్యాయసూత్రాలను నిర్మించి వివిధజాతులమధ్య ఏర్పడే తగాదాల విషయంలో వాటిని అమలుపరచేటందుకు