విల్సన్ లాబొరేటరీ, న్యూ యార్క్ ఆల్బనీలోని అబ్జర్వేటరీ, సముద్రాలపై ప్రయాణం చేస్తూ పూర్వం రూపొందించబడ్డ సర్వే పటాలను సరిదిద్దుతున్న చిన్న నౌక - ఇంకా యిందులోనివి ఎన్నో వున్నవి.
తరువాత తనకు అతిప్రియమైనది కానున్న హీరోఫండు కమీషను నెత్తుకున్నాడు. 1904లో యాభై లక్షల డాలర్లు ఇచ్చి దీనిని ప్రారంభించాడు. ఈ వంకకు అతని బుద్ధి మరలించినది పిట్సుబర్లుకు సమీపంలో ఉన్న బొగ్గు గనిలో జరిగిన విషాద సంఘటన. గనిలో ఒక ప్రేలుడు కలిగి లోపల ఉన్న జనమంతా సమాధి చెయ్యబడ్డారు. ఆ గనికి పూర్వపు సూపరింటెండెంటు మిస్టర్ ట్రైలర్. ఇతడు ప్రస్తుతం మరొక వ్యాపారంలోకి వెళ్ళాడు. ఆ గనిని గురించి తనకున్న జ్ఞానం, అనుభవం ఎందుకైనా ఉపకరిస్తాయన్న ఆశతో, అతివేగంగా ఆ దృశ్యం జరిగిన చోటికి వెళ్ళాడు. అతడు నాయకత్వానికి పేరెన్నిక గన్నవాడు. ఆదుర్దాతో చుట్టూ మూగిన వలంటీర్లును చేర్చుకొని నాయకత్వం వహించి అతడు గనిలోకి దారితీశాడు. వాళ్ళు మృతి జెందకుండా ఉన్న అనేకులను బయటకు తీసి బ్రతికింప గలిగారు. కానీ ధీరుడయిన టైలర్ మాత్రం ఆ చర్యలో తన ప్రాణాలను కోల్పోయినాడు.
మిత్రులకోసం తన ప్రాణాలను అర్పించిన ఆ వ్యక్తి కంటే ప్రేమ మరెవ్వరిలో అధికంగా వుండి వుండదు. ఈ వాక్యం ఈ విషాదసంఘటన తరువాత చిరకాలం వరకూ కార్నెగీ మనస్సులో మారుమ్రోగింది. గొప్ప సమయంలో ఈ హీరోఫండు పట్టింది. అతడు తరువాత ఇలా వ్రాశాడు. “నాకు దానిమీద పితృప్రేమ వుంది. ఎందువల్ల నంటే ఇది నాకు ఎవరూ సూచించింది కాదు. నాకు తెలిసినంతవరకూ దీన్ని గురించి ఎవరూ సూచించటం జరగలేదు. నిశ్చయంగా ఇది నా మేధాప్రియపుత్రిక.”
ఇది యుద్ధసమయంలోని వీరవరులకు, వీరనారీమణులకు కాకుండా, శాంతి సమయంలోని వీర స్త్రీపురుషులకు ఉద్దేశింపబడటం వల్ల దీని గుణాధిక్యాన్ని గురించి కొందరు శంకించారు. వీరోచితకృత్యాలకు ఇది ఉద్బోధకంగా ఉండటం చేత బహుమతి కోసం సాహసచర్యలను ప్రేరేపించటం దీని ప్రయోజనమౌతుందని ఈ పథకాన్ని విమర్శించే వారు ఊహించారు. అయితే దాత మనసులోకి అటువంటి అభిప్రాయం ఎన్నడూ రాలేదు. “నిజమైన వీరులెన్నడూ బహుమతి గురించి ఆలోచించరు!” అని కార్నెగీ అన్నాడు. వారు దివ్యోద్రేకం కలవాళ్ళు. తమను గురించి కాకుండా ఎల్లవేళలా వారు ప్రమాదస్థితిలో వున్న తమవాళ్ళను గురించి ఆలోచిస్తారు.