పిట్స్బర్గు టైమ్స్, పుస్తకాలు, మాగజైన్లు, వార్తాపత్రికలు పెద్ద ఖరీదు లయ్యేవి కావు కాబట్టి గ్రంథాలయం అనవసరమని, ప్రజాపార్కు అవసరమని, అందువల్ల కార్నెగీ దానికి ఇస్తే బాగుంటుందని సంపాదకీయం వ్రాసింది. అంతేకాకుండా గ్రంథాలయం కోసం పన్నులు వేసి డబ్బులు చేకూర్చటానికి నగరానికి అధికారం కూడా లేదని అది సూచించింది. అందువల్ల శాసనసభ గ్రంథాలయాన్ని నెలకొల్పి దానిని పాలన చేయించే విషయంలో ఒక శాసనం చేసేటంత వరకూ ఈ విషయం ఆరేళ్ళపాటు వెనకబడ్డది. అప్పటికి ఇంకా పిట్స్బర్గుతో చేరిపోని అలీఘను ఈ మధ్యకాలంలో కార్నెగీని అభ్యర్థించి, కల్నల్ ఆర్డర్ సన్ మోమోరియల్తో బాటుగా దానిని కూడ పొందింది. ఆ వుత్సవసమయంలో ప్రసంగించటానికి ప్రెసిడెంటు బెంజిమిన్ హారిసన్ వాషింగ్టన్ నుండి వచ్చాడు.
పిట్స్బర్గు 18, 87 చివరిలో ఆ దానాన్ని పుచ్చుకోటానికి సంసిద్ధమైనప్పుడు, కొలది సంవత్సరాలలోనే ఆ నగరం బాగా వృద్ధి పొందనున్న అంశాన్ని గమనించి, దానికి ఆ దానశీల, తాను ముందు భావించిన దానికంటే పరిశోధన, సంచరణ (Circulation) గుణాలకు అవకాశాన్నిచ్చే బృహద్గ్రంథాలయం, కళాఖండ నివేశనగృహం, (Art Gallery) ఆడిటోరియలు అవసరమని గుర్తించాడు. నగరపాలనకోసం 40,000 డాలర్లు వ్యయం చేస్తానని వాగ్దానం చేస్తే తాను పదిలక్షల డాలర్లు ఇస్తానన్నాడు. తరువాత త్వరలోనే దానికి మరో 1,00,000 (లక్ష) డాలర్లు చేర్చాడు. ఆర్టు గ్యాలరీ కోసం ఒక పదిలక్షల డాలర్లు యిచ్చాడు. కార్నెగీ ఇన్స్టిట్యూట్ పెరిగిపోయింది. ఒక పావు శతాబ్దిలో దాని దాత, దానికోసం 2,80,00,000 (రెండుకోట్ల ఎనభై లక్షలు) డాలర్లు వ్యయం చేశాడు.
అతని దానాలు విస్తృతిలోను, సంఖ్యలోను క్రమంగా పెరిగిపోతున్నవి. కొంతకాలంగా అతడు క్రొత్త భవనాలలో నిర్మించుకోవటానికి గ్రంథాలయాలను, ఇతరమయిన అవకాశాలను చేర్చుకునేటందుకు కళాశాలలకు 10,000 మొదలు 1,00,000 డాలర్ల వరకూ, కొన్ని సందర్భాలలో ఇంకా ఎక్కువ మొత్తాలు ఇస్తూ వచ్చాడు. అతడు నగరంలో ఇదివరకే ఉన్న గ్రంథాలయాలను పెంపొందించు కొనేటందుకు డబ్బు ఇచ్చిన సందర్భాలెన్నో ఉన్నాయి. ఉదాహరణకు అట్లాంటాలో యంగ్ మెన్స్ లైబ్రరీ ఎసోసియేషన్ ముప్పది సంవత్సరాలనుంచి ఒక ప్రజాగ్రంథాలయాన్ని నెలకొల్పి నడిపించడానికి ఎంతగానో తికమక పడుతున్నది. దాన్ని పెంపొందించి మంచి స్థితిలో నిలపటం కోసం, కార్నెగీ వారికి 1,25,000