ఒక పరిమితి దాటిన తరువాత, తంతివార్తలను అందజేసినందుకు, వార్తాహరి బాలుడు అదనంగా పదిసెంట్లను సంతోషంక్రింద వసూలు చేసుకునే అవకాశ మిచ్చారు. ఈ తంతివార్తలను అందజేయటంలో ఇతరులకంటే ఎక్కువ వంతు తెచ్చుకొనే విషయంలో ఆ బాలురకు ఆలోచనలు, చర్చలు ప్రారంభమైనవి. వాళ్ళ మైత్రికి భంగం కలగబోయేటంతగా కలతలు పెరుగుతున్నట్లు కనిపించాయి. అప్పుడు ఆండ్రూ, తనకు నైజమైన నీతినిపుణతతో, ఒకనాటి ఉదయం ఆ బాలబృందాన్ని వుద్దేశించి ఇలా అన్నాడు : 'మనం ఇలా పోటీపడటం తగదు. వార్తలను ఎవరు అందజేస్తున్నారన్నది మనం పెట్టుకోవద్దు. ఈ పదిసెంట్ల మొత్తాలను అన్నింటినీ సమష్టినిధిలో వేసి, నెలాఖరుకు అందరము సమానంగా పంచుకుందాము”
వ్యాపారంలో ఉపయోగింపబడుతున్న అర్థంతో సమష్టి (Pool) అన్న పదంతో ఇతనికి ఇంకా పరిచయం కలుగలేదు. కానీ అతడు చేసినది మాత్రం అదే. మిగిలిన బాలురందరూ ఈ సూచనగురించి యోచించి, ఆండీయే ఆ నిధికి కోశాధికారిగా వుండాలనే షరతుతో, అంగీకరించారు. దీని తరువాత దగ్గరలో ఉన్న ఒక తినుబండారాలమ్మే వాడి దగ్గర ఖాతాపెట్టి, ఈ పది సెంట్ల డబ్బులతో కొనుక్కుంటున్న కాండీ, కేకులను గురించి తప్ప, మళ్ళీ ఎన్నడూ వాళ్ళమధ్య తగాదా రాలేదు. కొందరు తమకు రావలసినదానికంటే తినుబండారాలను ఎక్కువ వాడుకున్నప్పుడు, ఆ వ్యాపారి నెలలో వచ్చే వారి వాటాలుపోను మిగిలిన డబ్బు చెల్లించవలసిందని కోరితే, ఆండీ ఇద్దరు ముగ్గురు అతిగా వాడుకుంటున్న వాళ్ళ అదనపు అప్పు డబ్బులను గురించి బాధ్యత వహించవలసివచ్చింది. తీపి వస్తువులంటే అతిలోభాన్ని చూపించే కుర్రవాళ్ళలో మిక్కిలి చెడ్డవాడు బాబ్ పిట్కైరన్. ఇతని దుబారాతనాన్ని గురించి హెచ్చరించి ఆండీ చీవాట్లు పెట్టినప్పుడు, "ఇతడు నా కడుపులో జీవజంతువులున్నాయి. అండీ! తీపి వస్తువులును పెట్టి వాటిని మేపకపోతే అవి నా డొక్కలు కొరికేస్తా" యని గంభీరంగా సమాధాన మిచ్చాడు.
వీరంతా ఎటువంటి బాలదళం! ఇందులోని రాబర్టు పిట్కైరన్ మధ్య మధ్య తన డబ్బును పెట్టుబడులలో పెట్టిన తరువాత, పెన్సిల్వేనియా రైల్ రోడ్ కంపెనీకి ఉపాధ్యక్షుడైనాడు. డేవిడ్ మెక్కార్టో రైలు మార్గాలను నిర్మించటానికి పూనుకొని, ఇతరులతో కలిసి అలిఘనీ నాలీ రైల్వే నిర్మాతల్లో ఒకడయినాడు. హెన్రీ ఆలివర్ ఒక పెద్ద ఉత్పత్తి సంస్థకు ప్రముఖుడయి, మిన్నసోటాలోని లోహఖనిజ ప్రాంతాన్ని వృద్ధి పొందించటంలో సహకరించి చివరకు ఒక కోటీశ్వరుడుగా మరణించాడు. విలియం