ఎనిమిదో దృశ్యం
(కారెంపూడి యుద్ధరంగము. బ్రహ్మనాయుని శిబిరములో ఆయన పూర్వ సేనాపతి
కొమ్మరాజుతో చదరంగ క్రీడ జరుపుతుంటాడు. సేనాధిపతి కన్నమదాసు సేనలను
పర్యవేక్షణ చేస్తూ వుంటాడు)
బ్రహ్మన్న : బావా! నీ రెండు శెకట్లూ చచ్చిపోయినయ్.
కొమ్మన్న : అయితే మంత్రిని నడిపిస్తాను - ఇదిగో రాజు.
బ్రహ్మన్న : సరిగ్గా చేతికి చిక్కావు... నీ మంత్రి (పాచికను నడిపించి) ఈ గుర్రంతో సరి... రాజును తప్పుకో. జంట యెత్తులో నీ మంత్రి మసి
కొమ్మన్న : నీ గుర్రాన్ని తీసేస్తున్నాను.
బ్రహ్మన్న : నా బంటుతో రాజు... తప్పుకో నా బంటు మంత్రి అవుతాడు. తోసిరాజని ఆట కట్టిస్తాను. ఇదిగో ఆటకట్టు.
కొమ్మరాజు : నీవెంత కైనా చాత నైనవాడివి... మహా మంత్రీ... ఈ రాజునే కాదు నలగామ రాజునైనా నీ బంటుతోనే కట్టిస్తావు. తలనొప్పిగా వున్నది... ఇక ఆట...
కన్నమ : (హడావుడిగా ప్రవేశించి) తండ్రీ! ఇక ఎంత కాలము? ఈ వీరులను ఇక ఆపలేను. త్వరగా సెలవియ్యండి.
బ్రహ్మన్న : తొందరపడితే ఎలా నాయనా! ఇప్పటికైనా వాళ్ళ మనస్సు తిరుగుతుందేమో
కన్నమ : ఇంకా తిరగటమా తండ్రీ... అనుజ్ఞ!! కొంత బలాన్ని ముందుగా నది దాటిస్తాను.
(వీరముష్టితో నమస్కరిస్తాడు)
బ్రహ్మన్న : తొందర పడకు తండ్రీ! యుద్ధమంటే, నీకేమీ అర్థం కానట్లున్నది. తీరా దిగినతరువాత సగంలో వెనక్కు రాము. అందులో ఈపలనాటి వీరులకు ఒళ్ళు తెలియని పౌరుషం వచ్చేస్తుంది. కొంచెం శాంతించు నాయనా!
74
వావిలాల సోమయాజులు సాహిత్యం-2