Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/788

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

“ద్విరాభిన్నాః” అనుదానికి వ్యాఖ్యతలు వ్రాసిన వివరమునుబట్టి 'ఆ' స్వరభేదమును గంధర్వులకే పలుక సాధ్యమని మానవులకు సాధ్యముకా దని తెలుఁగు లిపి వ్యాఖ్యలో నున్నది. శ్రీదాసుగారు పలికి చూపించినను ఎవరో ఒకరిద్దఱు వారిశిష్యులు తప్ప తక్కిన వారికి కర్ణగోచరమే అయియుండదేమో!

17) కాళిదాస వాల్మీకుల కవితామహనీయతలతో, మనోభావమధురిమలతో కథను నడిపినారు. ఆనాఁటి శ్రోతలతో వేద శాస్త్ర పురాణేతిహాస విజ్ఞులు “కథాగానవాచస్పతి” అనిరఁట!

23) వ్యాసుఁడు వేదార్థప్రతిపాదకములైన భారతాదులు లిఖియింపఁగా వారిని “కారణజన్ములు” అనిరి. అట్లే శ్రీదాసుగారును అందలి కథలను హరికథలుగా రూపొందించి గానముచేసినారు. వారి శిష్యులును అట్లే చేయుచున్నారు.

24) ప్రాచేతసుడు తపసువల్ల వాల్మీకను బిరుదు పొందినాఁడు. శతకోటి ప్రవిస్తరమౌ మహాకావ్యమును రచించి కావ్యగుణములైన సౌందర్యాదులను వర్ణించి రససిద్ధిని పొంది, పఠితలను సైతము ఆచంద్రార్కము రససిద్ధులను గావించిన కావ్యశిల్పము అజరామరము. అట్లే శ్రీదాసుగారు ఆ ఋషి చంద్రుని యోగశక్తిచే కొల్చి అఘమర్షణ మంత్రస్నానము (పురుషులు, తమ తమ అన్ని విధుములైన పాపములను, తాము స్నానము చేయు నీటిలో ఉన్నా 'క్రూర - అమేధ్య- అశాంత' అను మూడు చెడ్డగుణములను పోగొట్టి శారీరకముగా మానసికముగా తమ్ము పవిత్రులను చేయుమని వరుణుని ప్రార్థించు మంత్రభాగము - దీనినే 'అఘమర్షణ సూక్తము' అందురు, 'సుడులలో త్రిప్పి చంపుట' అనునది వీటియందలి క్రూరగుణము. పాచినురుగు మొదలగు అపవిత్ర వస్తువులతో గల సంబంధమే అమేధ్యము- "వేడి, పైత్యమ్ము వాతము, శ్లేష్మము" అను గుణములు నీటిలో గల 'అశాంతము' అనునది) చే నిత్యపునీతులై వాచికము, ఉపాంశువు మానసికము అను మూడు విధములైన జపము. "స్వాధ్యాయము” అను వీని ఫలితమే శ్రీదాసుగారికి కవితాశక్తి గలిగించినది.

25) శ్రీదాసుగారి రచనలు సర్వప్రజాసంక్షేమమును. భక్తజనులకు మాంగల్యము (మేలును) గలిగించునవి.

27) సదా సంతో భిగంతవ్యాః యద్యవ్యుపదిశంతి నో
    యాహిస్వైరకథాస్తేషాం ఉపదేశా భవంతి హి”

__ ______________________________________________________________________________

788

వావిలాల సోమయాజులు సాహిత్యం-1