చర్వణసహాలు. అటు నీలకంఠదీక్షితులు, ఇటు సోమయాజులవారూ సమస్కంధులు. ఆ మాటకు వస్తే సోమయాజులవారే ఓ ఆకు ఎక్కువ చదివారేమో ననిపిస్తుంది.
పద్యం, గద్యం, వ్యాసం, నాటకం, ప్రసంగం, ఉపన్యాసం, అనువాదం, పరిశోధన ఒకటేమిటి? తెలుగు, సంస్కృతం, హిందీ, ఇంగ్లీషు భాషల్ని ఆత్మగతం చేసుకున్న సాహిత్యాచార్యులు వావిలాల సోమయాజులు గారు.
నిరంతర జప తపో నిష్టాగరిష్ఠులైన యజ్ఞకర్తలకు నెలవైన విప్రులపల్లె అగ్రహారం (గుంటూరు జిల్లా) లో మాణిక్యాంబా సింగరాయావధానులకు ది. 19-1-1918లో జన్మించిన సోమయాజులుగారు, భూమిదేవినారాయణుల గర్భవాసాన జన్మించిన నీలకంఠదీక్షితులను తలపింప జెయ్యటంలో ఆశ్చర్య మేమీ లేదు. దీక్షితులు తిరుమల నాయకుని ప్రధానియై భోగా లనుభవించినా, శీలసంపత్తిలో, కవితలో సోమయాజులవారికి పరమానుకార్యుడే.
కనుకనే “కలి విడంబన" కావ్యం సోమయాజులుగారి దృష్టి నాకర్షించింది.
కలికాలంలో కవులు డబ్బుకు అమ్ముడుపోయే దుస్థితిని దీక్షితులు గర్హించారు. శబ్ద బ్రహ్మం వ్యాపారదృష్టికి అతీతంగా ఉండాలని ఆయన ఆశయం. పోతన్న గారి లాగే దీక్షితులవారున్నూ.
"శబ్దాఖ్యా మపరం బ్రహ్మ సందర్భేణ పరిష్కృతమ్
క్రీయతే కతిపయైః వృధాన్యైః వినియుజ్యతే” {37}
ఉ. "పాయక శబ్ద రూప మగు బ్రహ్మమునున్ కయిసేసి కొంద రా
ప్యాయత తోడ చేయుదురు వర్తకమున్, మరియున్ నిరర్థక
ప్రాయము గాగ కొందరు ప్రవర్తిలుచుందు; రెరింగి బ్రహ్మమే
ధ్యేయముగా చరించు గుణధీరులు లే రిల నెందు చూచినన్” (37)
సోమయాజులుగారు దీక్షితుల వారి త్రోవలో ప్రకృతం బ్రహ్మమే ధ్యేయముగా చరిస్తున్న గుణధీరులు, కలి విడంబనాను వాదానికి సర్వాధికారులు. వీరి ధీరగుణాన్ని బహుధా ప్రశంసిస్తూ, నా కీ ఉపక్రమ వాక్యాలు వ్రాసే అవకాశా న్నిచ్చిన సోమయాజులవారికీ, కవిముద్రాపకులు ఊట్ల కొండయార్య గుణ గ్రామణులకూ నమస్సు లర్పిస్తున్నాను.
- హైదరాబాద్ - 35
- ది. 14.7.1990
.వి.యల్ నరసింహారావు
కలివిడంబన
297