పుట:Varavikrayamu -1921.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రధమాంకము

17

కమ:- హుష్‌! ఊరకుండు యెవరో వచ్చుచున్నారు.

పేర:- (ప్రవేశించి) అమ్మా! పంతులుగారేంచేస్తున్నారు?

కాళిం:- మీ పేరు?

పేర:- నా పేరా? నాపేరొక విధంగా గడచి చచ్చిందా? చిన్నప్పుడు పేరడని, పేరగాడనీ అనేవారు. కాస్త ముదిరిన తర్వాత, పేరన్ననీ, పేరయ్యనీ అంటూ వచ్చేవారు. ఇప్పుడిప్పుడు పేరిశాస్త్రుర్లనీ, పేరిభొట్లనీ, పేరావధాన్లని, పేరిచైన్లనీ అంటున్నారు. ఇకముందేమంటారో ఈశ్వరునికే తెలియాలి.

కాళిం:- నాయనగారు భోజనము చేయుచున్నారు. అదిగో ఆకుర్చీపై గూరుచుండుడు.

పేర:- (కూర్చుండి) అయ్యో! నా యిల్లు బంగారము కానూ! అప్పటినుంచి యిప్పటిదాకా భోజనమేనా! బజార్లో పంతులుగారికి కనుపించిన తర్వాత, పండా కొండయ్య యింట్లో బారసాల సంభావన పుచ్చుకొని, వీసెడు వంకాయలూ, విస్తళ్ళూ కొనుక్కుని, యిద్దరితో మాట్లాడి యింటికి బోయి, స్నానంజేసి, సంధ్యావందనం చేసుకొని, జపంచేసుకొని, దేవతార్చన చేసుకొని, భోజనం చేసి, పొడుం చేసికొని, కాస్త మంచి శకునం కనపడేవరకూ గడపలో నుంచొని, అయిసర బొజ్జా అని అప్పుడు చక్కా వచ్చాను. అయితే, అమ్మా! మీరిద్దరూఁ పురుషోత్తమరావు పంతులుగారి పుత్రిక లనుకుంటాను, అంతేనా? ఆఁ! అదిగో! ఆ పోలికలే చెపుతున్నాయి! అయితే, మీ పేర్లేమమ్మా!

కాళిం:- నా పేరు కాళింది, మా చెల్లి పేరు కమల.

పేర:- ఏం చదువుకుంటున్నారు?

కమ:- ఇదివరకు ఇంగ్లీషు, తెలుగు చదివేవారము. ఇప్పుడు హిందీ, సంస్కృతము చదువుచున్నాము.

పేర:- ఓ యబ్బో! నా యిల్లు బంగారమైతే, నాలుగు భాషలే! అయితే ఆరుమోయన మేమయినా వాయిస్తారు?