వరవిక్రయము
ప్రధమాంకము
ప్రదేశము: పురుషోత్తమరావుగారి లోపలి చావడి.
ప్రవేశము: పంటెను నూలు చుట్టుచు భ్రమరాంబ,
(చరకాగానముతో నూలు వడకుచు కాళింది, కమల.)
కాళింది, కమల:-(మోహనరాగము - ఆది తాళము.)
చరకా ప్రభావం బెవ్వరి కెరుక! జగతిలోన మనచరకా॥
సిరులతోడఁ దులఁదూగుచున్న యల-
సీమజాతి చూచుచున్న దేమఱక.చరకా॥
చ. సాలున కిరువదికోట్ల రూప్యములు - సంపాదించెడు వారికె గాక
మేలి చేతిపనులు మాపుకొని - మేటి బానిసలమైన వెనుక,చరకా॥
పాటవమగు సామ్రాజ్యముఁ గూర్చున్ - పరిమితి లేని ధనంబును
జేర్చున్ కాటక రాకాసిని బరిమార్చున్ సాటిలేని యొక జాతి నొనర్చెన్. చర.
కాళింది:- అమ్మా! అదేమే - చేతిలోని నూలు చేతిలోనే యున్నది!
భ్రమ:-ఈ పూఁట నా దృష్టి యీపని మీఁద లేదే! మీ నాయనగారు మిల్లెగరిటెఁడు కాఫీనీళ్లు గొంతులోఁబోసికొని, ప్రొద్దునబోయిన పోక - యింతవఱ కింటికి రాలేదు! పండ్రెండు కొట్టి పావుగంటయైనది! ఎక్కడికి వెళ్లినారో యేమి పనిమీఁద నున్నారో తెలియదు!
కమ:- నాయనగారి కిప్పుడింకేమి పని యున్నది? - అహర్నిశలు అల్లుళ్ళను వెదకుటక్రింద సరిపడుచున్నవి.
భ్రమ:-అమ్మా! యేమి చేయుమనెదవు? ఆఁడుపిల్లలఁగన్న వారి యవస్థ యిప్పు డీ స్థితికి వచ్చినది!
గీ.కన్య నొక్కరి కొసఁగి స-ద్గతులు గాంతు
మనుచు సంతోషపడు కాల - మంతరించి,