Jump to content

పుట:Upanyaasapayoonidhi (1911).pdf/417

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

390

ఉపన్యాసపయోనిధి.

న్యాయవిరుద్ధముగా నొరులకు హానినిగాని తనకులాభమునుగాని యేవాక్కులు కలిగించునో యావాక్కుల నరుడుఁ దుర్వృత్తితోఁ బలికినప్పుడే యసత్యమగునుగాని లేకున్న గానేరవు. అట్టు కానిచో లోకమున సత్యసంధులేలేరని చెప్పవలసివచ్చును. మనమే యేవిషయముల ఘనమైనవిగా నెంచుచున్నామో వానినే నిందింపవలసివచ్చును. ఎట్లన.

(1) ఏదుర్వృత్తియునులేక లోకమునానందింపఁ జేయవలయునను తలంపుతోఁ గవీశ్వరుఁడు రమ్యతరములగు కావ్యముల విరచించుచున్నాఁడు. కావ్యములందు అలంకారార్థమైయున్నవి లేనట్లు లేనివియున్నట్లును జమత్కరింపఁ బడుచుండును. ఇట్టి కవులను అనృతవాదులని నిందించు వెంగలులుండఁజాలరుగదా.

(2.) నీతికోవిదులు లోకమునకు బాగుగా నీతిబోధించు మంచితలంపుతోఁ గధలనువ్రాసి యందు మయూరములు రాజ్యములు చేసినవనియు మరాళములు దౌత్యము నడపెననియుఁ జెప్పుదురు. ఇట్టి వారి నసత్యవాదులని నుడువుమూర్ఖులుండరుగదా.

(3) గురువు విద్యార్ధికిఁ దనతప్పు బాగుగానాటి రోషముతెచ్చుకొని బాగుపడవలెనను తలంపుతోఁ "స్టుపెడ్డు ఆను " మూర్ఖపుగాడిదె యని తూలనాడును. మనుజుని మనుజుఁడనక "ఆసు" (గాడిదె) అనినాఁడుగాన నాతఁడసత్యవాదియగుచున్నాఁడను నజ్ఞుఁడుండఁడుగదా.