పుట:Tikkana-Somayaji.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అయిదవ యధ్యాయము

అక్కన బయ్యనల దండయాత్ర

అక్కనబయ్యన లనుమనుమసిద్ధిరాజు దాయాదులు బలీయులై విక్రమసింహపురముపై దాడి వెడలివచ్చి యుద్ధముచేసి యా యుద్ధములో మనుమసిద్ధిరాజు నోడించి యాతనిఁ బాఱఁ ద్రోలి రాజ్యము నాక్రమించుకొని యుద్దండలీలఁ బరిపాలనము చేయసాగిరి. దీనికై యెంతయును జింతించుచు మనుమసిద్ధిరాజు మంత్రియు నాస్థానకవియు నగు తిక్కనసోమయాజి మనుమసిద్ది రాజుపక్షమును బూని కాకతీయుల రాజధాని యైన యేకశిలానగర మనునామాంతరముగల యోరుగంటికిఁ బోయి గణపతిదేవ చక్రవర్తికి భారతాఖ్యానమును వినిపించి యతనివలన బహుమానములను బడసి యతనితో మనుమసిద్ధి దురవస్థను దెలుపఁగా నాతఁడు సదయ హృదయుఁడై సోమయాజుల రాయబారమును శిరసావహించి బహుసైన్యములతో దండెత్తి వచ్చి అక్కన బయ్యనలను నెల్లూరునుండి పాఱఁద్రోలి మనుమసిద్ధిని బునరభిషిక్తుని గావించి వెడలిపోయెనని సిద్ధేశ్వరచరిత్రములోని యీ క్రింది చరణములవలన బోధపడఁగలదు.