పుట:Tikkana-Somayaji.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

40

తిక్కన సోమయాజి

"మ. ద్రవిడోర్వీపతి గర్వముం దునిమి, శౌర్యం జొప్పఁ గర్ణాటద
     ర్పవిఘాతంబు నొనర్చి వైరిమనుజేంద్రశ్రేణికిం గొంగనా
     నవనిం బేర్కొని యున్నయట్టి విజయక్ష్మాధీశ్వరుం గాసిగా
     నెవిచెం జోళనమన్మసిద్ధి యనిఁ బ్రాయేటం బ్రగాడోద్ధతిన్."

ఈపైపద్యమున విజయక్ష్మా ధీశ్వరుని జయిం చె నని చెప్పఁ బడియున్నది. ఇందలి విజయక్ష్మాధీశ్వరుఁ డెవ్వఁడో తెలిసికొన సాధ్యము గాక యున్నది. విజయక్ష్మాధీశ్వరుఁడు మనుమసిద్ధి దాయాదుఁ డేమోయని సంశయము గలుగుచున్న ది. విజయగండగోపాలుఁడు 1260 వ సంవత్సరము మొదలుకొని 1292 వఱకుఁ గాంచీపురముండలమును బరిపాలించి నట్లు గనంబడుచున్నది. ఇతనిశాసనములు కాంచీపురమండలముననేగాక నెల్లూరు, గూడూరు, సుళ్లూరుపేట తాలూకాలలోఁ గానుపించు చున్నవి. ఇతనికి త్రిభువనచక్రవర్తి యను బిరుదము గలదు. ఇతఁడు చాలకాలము బ్రదికియున్నవాఁడు గావున వయస్సున మనుమసిద్ధి కంటెఁ జిన్నవాఁడై యుండును. ఇతఁడు మూఁడవ రాజేంద్రచోడునకుఁ బిమ్మట స్వతంత్రుఁ డై కాంచీపురమండల మేలె నని తోఁచుచున్నది. ఇతఁడు మొదట రాజేంద్రచోడుని పక్షమునఁ గాని లేక జటవర్మసుందరపాండ్యుని పక్షమునఁ గాని చేరి మనుమసిద్దిరాజుతో యుద్ధముచేసి యోడిపోయి యుండవచ్చును. ఇందునుగూర్చి యాంధ్రుల చరిత్రమం దిట్లు వ్రాయఁ బడియెను.