పుట:Tikkana-Somayaji.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాలుగవ యధ్యాయము

37

బ్రాహ్మణావళికి ధారలు పోసినజలంబు
       సతతంబు ముంగిట జాలువాఱు
రిపుల కొసఁగిన పత్రికల పుత్త్రికలను
       బాయక కరణముల్ వ్రాయు చుంద్రు

గీ. మానఘనుఁ డైనతిక్కనమంత్రి యింట
   మదనసముఁ డైనతిక్కనమంత్రి యింట
   మహితయశుఁ డైనతిక్కనమంత్రి యింట
   మంత్రిమణి యైనతిక్కనమంత్రి యింట."

అని మనోహరముగా నభివర్ణించి యున్నాఁడు. ఇట్టి మహనీయు లగుమంత్రివర్యుల సాహాయ్యముతో మనుమసిద్ధిభూపాలుఁడు కొంతకాలము విక్రమసింహపురము రాజధానిగాఁ జేసికొని రాజ్య పరిపాలనము చేసి విశుద్ధయశమును గాంచెను. ఇతఁడు మొట్టమొదట పేరునకు మాత్రము రాజరాజచోడునకు సామంతుఁడుగా నుండినను మూడవరాజేంద్రుఁచోడుని కాలమున స్వతంత్రుఁ డై కడపట కాకతీయాంధ్ర చక్రవర్తి యగు గణపతిదేవునకు లోఁబడిన సామంతుఁ డై రాజ్యపరిపాలనము చేసెను. చాళుక్యచోడ చక్రవర్తు లయిన రాజరాజచోడుఁడును, రాజేంద్ర చోడుఁడును బిరుదమాత్ర చక్రవర్తులే గాని నిజముగాఁ జక్రవర్తిపదము నధిష్ఠించి పరరాజులనుండి కప్పములు గైకొనుచుఁ దమయధికారమును వారలపైఁ జూపు శక్తిగలవారైయున్నట్టు గానుపింపరు.