పుట:Tikkana-Somayaji.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడవ యధ్యాయము

27


నదీతటమున గురుకులంబున శ్రద్ధాభక్తులతో గురువులకు శుశ్రూషలు గావింపుచుఁ గ్రమశిక్షణము గలిగి వేదాధ్యయనముగావించె నని మనకుఁ దేటపడక మానదు, ఆగర్భ శ్రీమంతుఁ డై పుట్టియు నిజకులాచారధర్మరక్షణాభినిరతీ గలిగి బీదబ్రాహ్మణబాలురతోఁ గలిసి విద్యాభ్యాసముఁ జేయుట గౌరవలోపముగా నెంచుకొనక తానెంత యైశ్వర్యవంతుఁ డైనను విద్యాసముపార్జనము లేకయున్నఁ దన జీవితము లోకములో వన్నెకెక్కి పరమార్థమును బొందఁజాల దనితలంచి తన పూర్వులవలెనే తానును వేదాదిసమస్తవిద్యాభ్యసనము చేయవలయు నని తిక్కన సంకల్పించుకొని గురుకులంబుఁజేరి తొలుత వేదాధ్యయనముఁగావించి నట్లు స్పష్టముగాఁ గనంబడుచున్నది. స్వధర్మము నతిక్రమింపక నడచుకొనెడు వర్తనము బాల్యమునందే తల్లిదండ్రుల నుండి తిక్కన గ్రహించెను. మహత్తరమైన మనోరధసృష్టి బాల్యమునందే యంకురించి నందునఁ దత్పోషణార్థము తిక్కన దీక్ష వహించి కృషి సలిపెను. పితృమాతృభక్తి విశేషముగాఁ గలవాఁ డౌట చేతఁ బెద్దలయెడ వినయవిధేయత లనుజూపుట సంభవ మయ్యెను. నిరంతరమును గురుసాన్నిధ్యమున నుండి వేదాధ్యయనము సలుపుటచేత వినయ విధేయతలు మాత్రమెగాక యోపికయు, శాంతమును, ప్రస్పుట మైనవాక్కును సంపాదించుకొనఁ గలిగెను. వైదికవిద్యాభిలాషి యై పినాకినీనదీతటమున గురుకులంబున.