పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయభాగము

హేమకుసుమసుందరి

1

చిత్రమైన త్యాగతి కథ అంతా చదువుకుంది హేమసుందరి. కాబట్టి శ్రీనాథమూర్తి బావకుడా తన్ను వివాహం చేసికో సంకల్పించుకొన్న స్వయంవర నాయకులలో ఒకడా! అప్పుడే అనుకుంది. తాను త్యాగతిని ఆ హిమాలయం కొండలమీదనుంచి దింపాలని సంకల్పించింది. అదివరకే దిగి ఉన్నాడు. కల్పమూర్తి వగైరాదులవలె ఇతడూ ఒకడయ్యాడు.

ఆమె మొగం జేవురించింది. ఆడదంటే కబళించే ఇడ్డెనని మగ వాళ్ళ ఉద్దేశం. ఆడదే ఎందుకు మగవాళ్ళను ఎన్నుకోకూడడూ?

ఆమె లేచింది కూర్చుంది. మాట్లాడకుండ స్నానానికి వెళ్ళిపోయింది. స్నానంచేసి హేమ సత్యభామలా అలంకరించుకుంది. బావ అని తెలిసికోవడం ఆనందమూ అయింది. త్యాగతి అంటే తాను ఊహించుకునే ఏవో విచిత్ర పథాలన్నీ కరిగిపోయాయి.

కాని తన బావ చరిత్ర ఎంత వుత్కృష్టమైంది. తన అక్కకోసం ఎంత బాధపడినాడు. తనలో శకుంతలాదేవిని చూచాడా? అదీ నిజమే! తాను నూరుపోలికలా తన అక్కే! పడి ముఖ్యమైన వాటిలో మాత్రం సంపూర్ణమైన తేడా! తన అక్క బ్రతికి ఉంటే?

బ్రతికివుంటే నలుగురి పిల్లల తల్లి ఔను. ముసలిదానిలా తయారవును. తాను చూట్టం లేదూ, లోకంలో అందమైనవాళ్ళు అనుకున్న వాళ్ళని! తనతో చదువుకున్న అంబుజమ్మ అప్పుడే ఇద్దరి పిల్లల తల్లి. వట్టి ముసలినక్కలా ప్రత్యక్షమైంది. కాలేజీ పిల్లగా వున్నవాళ్ళు ఎంత టక్కుల టమారిలా గ్రేటా గార్బోలా, మార్లీ నీడిట్రిచ్చిలా, లీలాఛిట్నిసులా వుండేది? ఇప్పుడు ఐదు వందల సంవత్సరాలనాటి ఆడముత్తయిదువులా వుంది.

అదే ఆడదాని బ్రతుకు. మగవాడు టింగురంగా అని ముసలితనం వచ్చేవరకూ పెల్లికోడుకులానే వుంటాడు. మగవాడే ఎందుకు బిడ్డలను కనగూడదు? పోనీ ఆడది బిడ్డనుకంటే, పాలివ్వడం వంతు మగవాడి పాలిట ఎందుకు పడలేదో? అయినా తన అక్క దేవతా స్వరూపిణీ. ఆమె యౌవనంలో ఎలావున్నదో, బిడ్డలు కన్నతర్వాతా అలాగే వుండి వుండును. కాని, తన బావ ఇంత మహోత్తమ శిల్పి అయివుండునా? అప్పుడు ఇరువురు కలిసి ఈ దేశాలన్నీ తిరిగి వుందురేమో?

ప్రపంచంలో ప్రణయమో, ప్రళయమో యింత గడబిడ యెందుకు? రాజ్యాలు, అభ్యుదయం, కళలు, భగవంతుడు అన్నీ వెనకబడతాయి. ఈ ప్రేమ అనే