పుట:Thittla gnanam.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కర్మనాశనమై మోక్షము పొందగలరని పెద్దలు కూడ తెలుపుచున్నారు. ఈ విధానమును అనుసరించియే తమ శిష్యునికి జ్ఞానము సంపూర్ణముగ కలుగవలెనని, జ్ఞానాగ్ని శిరస్సులో వెలుగవలెనని, జంబుకేశ్వరుడు తలచి తన పాదములకు నమస్కరించునపుడు 'నీ శిరస్సున దీపమెలగనాని' అని దీవించాడు. జ్ఞానదీపము తలయందు ప్రకాశించి అజ్ఞానము తొలగి కర్మకాలి పోవలయునని ఆనాటి వారిభావము. కాని ఈనాడు అది తిట్టుగ పరిగణించబడుచున్నది. ఆడవారు కొందరు పల్లెప్రాంతములలో ఈ వాక్యమును తిట్టుగ నేటికిని వాడుచున్నారు. తిట్లుగ వాడుచున్న చాలా వాక్యములు జ్ఞాన సంబంధమైనవని చాలామందికి తెలియకుండ పోయినది.

-***-


నీ పాపము కూల

ఇలా ఎన్నో దీవెన వాక్యములు దూషణలుగ మారియున్న ఈకాలములో కూడ ఒకే ఒక దీవెన తిట్టుకాక దూషణగకాక మద్యలో మిగిలిపోయినది. "నీ పాపము కూల" అను వాక్యము స్వచ్చమైన దీవెనే అయినప్పటికి అది ఊత పదముగ మిగిలిపోయినది. ఇప్పటికి కొన్ని పల్లెప్రాంతములలో కొన్ని ప్రాంతీయ భాషలందు "నీ పాపము కూల" అనియు, అదేపదమునే "నీ పాసుకూల" అనియు అనుట వినుచున్నాము. ఇంతకుముందుచెప్పిన ఏడు దీవెనలను ఎక్కువగ ఆడవారే తిట్లరూపములో ఉపయోగిస్తుండగ, నీపాసుకూల అనే వాక్యమును మగవారే ఎక్కువగ వాడుచున్నారు. పూర్వము గురువులు, స్వాములు, మహర్షులు తమ శిష్యులను, భక్తులను పాపమునుండి విముక్తి గావించుటకు వాడిన దీవెనయే "నీ పాపము కూల" అనుమాట. నీ పాపము కూల అనుమాట కాలక్రమమున 'నీపాసుగూల' అను మాటగ కూడ మారిపోయినది.

-***-