పుట:Tenaali-Raamakrishnakavi-Charitramu.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెనాలి రామకృష్ణకవి చరిత్రము

47


చుండును. ఒకనా డామె యంగడికిబోయి కోడిపెట్ట నొక దానింగొని కుక్కగొలుసు మఱొక కేలంబూని వచ్చుచుండెను. రామకృష్ణు డామార్గముననే పోవుచు తన కెదురైన మొల్లనుజూచి, పరిహాసపూర్వకముగా 'మొల్లా! రూపాయిచ్చెద గుక్కనిచ్చెదవా, పెట్ట నిచ్చెదవా? యనెను. ఆ వ్యంగ్య సంభాషణకు గుపితయయ్యు పరమ శాంతస్వభావి యగు మొల్ల 'రామకృష్ణకవీ! నీవేమి యీయఁబూనినను నీకు నేనమ్మనుకదా!' యనెను. రామకృష్ణుడు సిగ్గుపడి యారోజు నుండియు నామెయందు మాతృభావము గల్గియుండెను.


28 అయిదు వేలు

రాయలు కవులందరకు మాసవేతన మిచ్చుచుండెను. రామకృష్ణకవికూడ యదేవిధమున మాసవేతనము నొందుచు బిల్లలు కలవా డగుటచే నా ధనముతో గడుపుకొనజాలక యిబ్బంది పడుచుండెను. ఎట్లయిన రాయలునుండి ధనము స్వీకరింపవలయునని రామకృష్ణు డుపాయముల నూహింపసాగెను. తుదకొక చక్కని యుక్తి నాలోచించి, భార్యాపుత్రులకుజెప్పి, రాయలకడ కరిగెను. రాయలు సంతోషాన్వితస్వాంతుడై యున్నతఱి రామకృష్ణుడు సమీపించి, మహారాజా ! నాగుండెలు నిరంతరము నగ్నిహోత్రముచే దహింపబడినట్టుమండిపోవుచున్నవి. ఇక నేనెంతో కాలము బ్రతుకను. నాకు జాలమంది పిల్లలు కలరు. నేను మరణించినచో వారిపాట్లు వర్ణించుట కా యాదిశేషునికైన నలవికాదు, జ్యోతిష్కులుకూడ నిక నెంతోకాలము బ్రతుకవనిరి. నాకు జాల బెంగగానున్నదనెను. రాయలు దయార్ద్రహృదయుడు. రామకృష్ణుని వాక్యములకు జూలినొంది. 'కవిచంద్రమా ! ధనార్జనాసక్తులగు జ్యోతిష్కులమాట పాటింపరాదు. నీవట్టి బెంగలతో క్రుంగిపోకుము. 'మనోవ్యాధికి మందు లేదుకదా ! యను సూక్తి నెరుంగవే? ఒక వేళ నీవు మృతి నొందుటయే తటస్థించినచో నీ భార్య కయిదువేల దీనారముల నంపె