తెనాలి రామకృష్ణకవి చరిత్రము
19
రాయలు సరేయని యొకదినము నిర్ణయించెను. వివిధబిరుదవిరాజితుండగు కుంకుమబొట్లు తమ్ము గెలచినయెడల రాయలు తమ్ము గౌరవించుట మానునని భయముఁజెంది. పెద్దనాదికవులు రామకృష్ణునిఁ జేరి 'వికట కవిశిరోమణీ! ఈ కుంకుమబొట్లు మనల గెలువజాలని యుపాయ మూహించి, మన గౌరవము కాపాడుమా' యనిరి.
రామకృష్ణుఁడట్లేయని, యానాటి సాయంకాలము నౌకరువలె మాఱువేషము ధరించి, కుంకుమబొట్లు బసచేసియున్న యింటి యరుగుపై గూర్చుండెను. కుంకుమబొట్లిటునటు పచారు చేయుచుండఁగా, నాతండు వినునట్లు రామకృష్ణు డీపద్యమును చదివెను-
శా. సమర్ధక్షమ ! ధీనిబంధన విధాసంక్రందనాచార్య శూ
రమ్మన్యాచల వజ్రపాత ! జగవీరక్షాంబుజాక్షా ! శర
ధ్యమ్మార్గస్థ దశాశ్యరాజ్యనమసహ్వత్ప్రోద్భవాతీరభా
గుమ్మత్తూరి శివంసముద్ర పురవప్రోన్మూలనాడంబరా!'
ఆపద్యము నాలకించి, కుంకుమబొట్లు ' ఈతడెవ్వడు? వేషమును బట్టి సేవకునివలెఁ గాన్పించుచున్నాఁడు. అయినను మాట్లాడించి, చూచెదగాక , యని 'ఓరీ! నీ వెవ్వడవు? అని యడుగ నాతడిట్లు సమాధాన మిచ్చెను -
'అయ్యా! నేను తెనాలి రామకృష్ణకవిగారి సేవకుడను'
'ఓహో! అటులనా? నీవు రామకృష్ణకవిగారి పరిచారకుడవా? బాగుబాగు నీ యజమానికూడ ఆస్థానమందలి యష్టదిగ్గజములలోని వాఁడేనటకదా?'
'అవును, ఆయనకడనే నేను కవిత్వము చెప్పుట 'నేర్చుకొంటిని'
'సరే ఏదీ మఱియొక పద్యము జదువుము.'
మాయవేషముననున్న రామకృష్ణుఁ డీపద్యమును జదివెను.
క. నరసింహ కృష్ణరాయని
కరమరుదగు కీర్తికాంత కరిభిద్గిరిభి