పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/761

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సాగిస్తూ గంటెలలోని వచ్చిని ఎదగోస్తూ వుంటారు. ఈ వత్తుల వెలుగురు వల్ల ముఖంలో ప్రతిబింబించే సాత్వికాభినయానికి ఎక్కువ ప్రాముఖ్యాన్నిస్తారు. ప్రాచీనులు ఈ పద్ధతిని ఎక్కువగా అనుసరించేవారు. అంటే ఆ నాటికే ముఖాభినయానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి నట్లు మనం తెలుసుకోవచ్చు. ప్రతి వారి చేతిలోను గరిటె వుంటుంది కాబట్టి, ఆ గరిట ప్రాముఖ్యంతోనే నాటకాలను ప్రదర్శిస్తారు. అందుకే వారిని గరిటె భాగవతులనీ, గంటె భాగవతులనీ పేరు వచ్చింది.


పగలేసిగాళ్ళు

రాయలసీమ ప్రాంతంలో పగటి వేష గాళ్ళను పగలేసి గాళ్ళని పిలుస్తారని తమ జానపద కళాసంపదలో దోణప్ప గారు ఉదహరించారు. వీరు కూడా విప్రవినోదులు లాంటివారు.

దొర వేషం " దొరసాని వేషం", "వడ్డెర వాడు", "బ్రాహ్మణ వితంతువు " మొదలైన వేషాలను ధరించి చమత్కారమైన మాటల తీరుతో ప్రజలను ఆనందింపచేస్తారు.

వీరికి ఒక వూరూ వాడా అని వుండదు. దేశ సంచారం చేస్తూ సంవత్సరానికి కొక సారి వార్షికంగా వచ్చి ప్రదర్శనలిచ్చి పారితోషికాలు పొంది వెళతారు.

ధరించే ఆ యా పాత్రల నడక, మాట యాస, భాషా ఉచ్ఛారణ వారికి వెన్నతో పెట్టిన విద్య. ప్రతి వేషాన్నీ తీర్చి దిద్దుకుని సహజత్వం వుట్టి పడేలా వుండే అలంకరణ వస్తు సామాగ్రిని వారే సమకూర్చుకుంటారు. ఎవరు ఏ మాట మాటాడినా పరిహాస దరహాసంతో సమాధానా లిస్తారు.


పంబలవారు

సర్కారు ఆంధ్ర ప్రాంతంలో ఒకప్పుడు విరివిగా జరిగే దేవతల కొలువుల్లోనూ, జాతర్ల లోనూ పంబలవారి కథలు ఎక్కువగా జరుగుతూ వుండేవి. ఈ నాటికీ గ్రామదేవతలను కొలిచే ప్రతి చోటా ఈ కథలు జరుగుతూ వున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ కథలు కనుమరుగు ఔతున్నాయి.