పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/397

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
అందాల అలంకారం:

అమ్మ విగ్రహాన్ని అలంకరించినట్లుగానే, చీరా, గాజులు, పసుపు కుంకుమలతో ఈ గరగలను కూడ అలంకరించి, ఒక పూజ్య భావాన్ని గోచరింప చేస్తారు. కొన్ని కొన్ని గ్రామలలో, తీర్థ మహోత్సవాలలో జాతర జరుపుతూ మరలా పంట జారగా సంవత్సరానికి రెండు జాతరలు జరుపుకుంటారు. వీరి ముఖ్యోద్దేశం గ్రామ ప్రజలు సుఖ సంతోషాలకు ఆరిష్ట నివారణకు పిశాచ భయ విధ్వంస నానికి ముఖ్యంగా గ్రామ సంరక్షణకూ గ్రామ దేవతలే మూలమని, గర్భగుడిలోని అమ్మవారి మూల విరాట్టుకు ప్రతి రూపంగా ఈ గరగలను మాత్రంమే బయటకు తెచ్చి తీర్థ జాతరలలో వినియోగించడం, ఈ గరగ దర్శనంతో అమ్మవారి దర్శన భాగ్యం కలిగినట్లు భావించడం ఒక నిత్య సత్యమైంది.

శిరములపై గరగలు:

ఆయా సమయాలలో గర్భగుడి నుండి బయటకు తీసుకు వచ్చిన గరగలు ఆసాదుల శిరముల నలంకరించి లయబద్ధమైన డప్పుల వాయిద్యాల మధ్య తాళాని కనుగుణ్యమైన నృత్యంతో పుర వీధులలో ఊరేగుతూ తమతమ ప్రదేశాలకు రాగానే ఆసాదుల కాళ్ళకు బిందెడు నీళ్ళు అభిషేకంతో, ఫల వుష్పాలతో పాటు, చీరలూ గాజులూ, పశుపు కుంకమలను సమర్పించుకుని అమ్మవారి సేవకు అంకితమౌతారు భక్తులు.

ఈ గరగ నృత్యాన్ని నృత్యకారు లెంత నేర్పుగా ప్రదర్శిస్తారో ఆ నేర్పుకు తగిన లయబద్ధ సహకారం డప్పులు వాయించే వారు అందిస్తూ వుంటారు. ఈ రెండు సమిష్టి కలయికల తోనూ ఈ గరగ నృత్యం ఎంతగానో శోభిల్లు తుంది. ఈ గరగలను సేవించడం ద్వారా ఆమ్మవారిని సేవించి నట్లే భావింప బడుతుంది.