పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/245

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
అసలు తానీషా భూరి విరాళం:

సిద్ధేంద్రయోగి పెట్టిన బిక్షతో అనేక సంవత్సరాలు కూచిపూడి వారు యక్షగానాల ద్వారాను, వీధిభాగవతాల ద్వారాను నానాదేశ సందర్శనం చేసి విరాళాలను పొందారు. ఆ విధంగానే గోల్కొండను పరిపాలించిన నవాబ్ అబ్దుల్ హసన్ తానీషా కూడ కూచిపూడి కళాకారులకు 1687 లో కూచిపూడి గ్రామాన్ని అగ్రహారంగా దాన మిచ్చారు. ఆ కాలంలో సిద్ధేంద్ర యోగి జీవించే వున్నాడని, నవాబుతో రాగి రేకుమీద ఆగ్రహారపు దానపట్టాను వ్రాయించింది కూడ సిద్ధేంద్రుడేనని కొందరంటున్నారు. ఏది ఏమైనా నాట్య కళా సాంప్రదాయాలకు తమ జీవితాన్ని అంకితం చేసిన బ్రాహ్మణ కుటుంబాల కళాకారు లందరూ ఈ ఆగ్రహారపు దానాన్ని పొందేటట్లు పట్టాలో వ్రాయబడిందట. ఆ నాటి నుండి ఈనాటివరకూ తరతరాలుగా ఆ కుటుంబాలన్నీ దీనిని అనుభవిస్తూనే వున్నాయి.

'సాహెబా సల్లామురా'తో సన్మానం:

కూచిపూడి భాగవతులు ఆనాటి ఆంధ్ర దేశమే కాక హైదరాబాదు, విజయనగరం, తంజావూరు మొదలైన సంస్థానాలన్నిటిని సందర్శించే వారు. అనేక మంది రాజుల్నీ సామంతుల్నీ ఆశ్రయించారు. అలా సంచారం చేసే రోజుల్లో బననగాని పల్లె నవాబు వారిని ఆహ్వానించి వారి ప్రదర్శన లన్నిటినీ చూసి వారి కౌశల్యాన్ని వేనోళ్ళ పొగిడి వారికి తగిన పారితోషికాన్నిచ్చారు.

కూచిపూడి ఇలా మహమ్మదీయ నవాబుల సన్నిధికి వెళ్ళినప్పుడల్లా వారిని స్త్రోత్రం చేస్తూ వుండేవారు. వారి పాటల్లో ఎక్కడో ఒక చోట వారిని స్తుతిస్తూ వుండేవారు. వారి జతులు రాముని మీదో, విష్ణువు మీదో, కృష్ణుని మీదో రచింపబడి, కీర్తనాంతంలో తుది పాదంలో 'సాహెబా

సల్లామురా' అని స్తుతించేవారు. అంటే అటు హిందువులకు ఆగ్రహం లేకుండా హిందుమత సాంప్రదాయ ప్రకారం విష్ణునీ కృష్ణునీ కీర్తించి, ఇటు 'సాహెబా నల్లామురా' అని నవాబుల మెప్పును పొందే వారు. ఇలా లౌకిక వృత్తితో కళా ప్రచారాన్ని అన్నిమార్గాలా, అన్ని మతాల ప్రజల్లోకీ చొప్పించారు. ఉదాహరణకు వారు కీర్తించిన ఒక జతిలో__