పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/233

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆధారపడేవారు. ఇరుప్రక్కలా వెలుగునిచ్చే రెండు కంచు నూనె కాగడాలు వేసేవారు. పాత్రల ప్రవేశంలో రాజు, రాణి, యముడు, కంసుడు మొదలగు ముఖ్య పాత్రల ప్రవేశంలో ఇత గుగ్గిలాన్ని ఆ కాగడాలపై గుప్పేవారు. అది ఆ సమయంలో గొప్ప కాంతితో గుప్పుమని మెరిసేది. ఈ మెరుపులో పాత్రలు ప్రవేశమయ్యేవి.

ఈ విధంగా వారు వారి రంగ స్థలాన్ని నిర్మించుకునేవారు. అందుకు గ్రామస్థులందరూ సహాయపడేవారు. ప్రదర్శనానికి కాకితో కబురంపితే సరి చుట్టుప్రక్కల గ్రామాల నుండి, జనం గుంపులు గుంపులుగా వచ్చేవారు. ఇందుకు కారణం ఇంతకు మినహా ఆనాడు వినోద కార్యక్రమాలు లేనే లేవు కనుక.

ఊరిపెద్దలందరికి పిలుపు - ప్రదర్శన ప్రారంభం.

రాత్రి సుమారు పది గంటలకు, ప్రదర్శనం ప్రారంభమయ్యేది. ఈ లోగా భాగవతులందరూ గ్రామంలో వున్న ఆయా ఇండ్లలో భోజనం చేయడం గాని, స్వయం పాకంకాని చేసుకునేవారు. రంగస్థలానికి కొంచెం దూరంలో వున్న ఇంటిలో ముఖాలంకరణ చేసుకునేవారు. ప్రేక్షకులందరూ వచ్చేవరకూ సూత్రధారులు వాద్య విశేషాలతో వివిధ రకాలయిన పాటలను పాడుతూ గణపతి ప్రార్థన, సరస్వతి, లక్ష్మీ ప్రార్థనలు చేసే వారు. ఒక ప్రక్క వేషాలు తయారవుతూ వుండేవి. మరో ప్రక్క ప్రేక్షకులందరూ, ఆసీనులై వుండే వారు. గ్రామంలో వున్న పండితులూ, గ్రామ పెద్దలూ, మున్సిఫ్ కరణం మొదలైన పెద్దలందరూ వచ్చి ముందు వరుసలో కూర్చునేవారు. పెద్దలందరూ వస్తేగాని ప్రదర్శన ప్రారంభమయ్యేది కాదు. వచ్చిన వారందర్నీ, వారికి సహాయాలు చేసేవారిని ఈ విధంగా సంబోధించేవారు.

అందరూ వచ్చియున్నరటరా?:

ఈ సభారంగమునకు అందరూ వచ్చి యున్నా రటరా?,

చిత్తం!

కరణంగారూ?