పుట:TELUGU-NAVALA.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తెలుగు నవల

1857వ సంవత్సరంలో విక్టోరియా రాజ్ఞి భారతదేశ పరిపాలనా బాధ్యతను స్వీకరించింది. ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం భగ్నమైపొయింది. ఇంగ్లీషు పరిపాలన కట్టుదిట్టముగా బలపడుతూ వచ్చింది.

1878వ సంవత్సరం లార్డుమేయో బెంగాలు గెజిటులో ఒక ప్రకటన చేశాడు. బంగాళదేశీయుల ఆచార వ్యవహారాలు జీవనవిధానమూ తెలియజేసే గ్రంధానికి బహుమానం లభిస్తుందనేదే ఆ ప్రకటన.

తెలుగుదేశంలో కర్నూల్లో ఆ రోజుల్లో నరహరి గోపాల కృష్ణమ్మ శెట్టి అనే డెప్యూటీ కలెక్టరుండేవారు. బెంగాల్ గెజిటులొని బహుమాన ప్రకటన, తెలుగులో అటువంటి ప్రయత్నం చేయడానికి గోపాలకృష్ణమ్మగారిని ప్రేరేపించింది. ఆ ప్రేరణతో ఆయన శ్రీరంగరాజ చరిత్రమనే చిన్న వచనప్రబంధం వ్రాసి 1872 లో ప్రకటించాడు. ఈ శ్రీరంగరాజ చరిత్రను మద్రాసు గెజెటు తొలి తెలుగు నవలగా పేర్కొన్నది. నాటి సమకాలిక తెలుగు పత్రికలుకూడా దీనిని నవలగానే సంభావించాయి. రచయిత మాత్రం హిందువుల యాచారములు తెలుపు నవీన ప్రబంధం అన్నాడు దీన్ని.

తెలుగు నవల పుట్టిన తరువాత ఇంచుమించుగా పాతికేళ్ళ దాకా ఈ ప్రక్రియను వచన ప్రబంధమనే వ్యవహరించేవాళ్ళు. నవల అనే పదం వాడుక లోకి తెచ్చింది కాశీ భట్టబ్రహ్మయ్యశాస్త్రిగారు. అప్పటిదాకా నవలలు వ్రాసిన వాళ్ళంతా తమ గ్రంథాలను వచన ప్రబంధాలనే పిలిచేవాళ్ళు

1872 వ సంవత్సరానికి పూర్వమే కొక్కొండ వేంకటరత్నం పంతులు గారు 'మహాశ్వేత ' అనే నవల వ్రాశారని కొందరు పండిత విమర్శకులు ప్రతిపాదించారు కాని, పరిశీలనం మీద కాదంబరిలోని మహాశ్వేత వృత్తాంతానికి వేంకట రత్నం పంతులుగారు యథాతథానువాదం చేశారు కాని, కాదంబరి ఆధారంగా వచనప్రబంధ రచన చేయలేదని స్పష్టపడింది.