పుట:TELUGU-NAVALA.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తెలుగు నవల

41

“బీనాదేవి" ఇటీవల రచించిన "హాంగ్ మి క్విక్ " ఆలోచనలు రేకెత్తించడంలోనూ, భాషలోనూ, భావాలలోనూ, శిల్పంలోనూ, ప్రత్యేకతను సంపాదించుకొన్న నవల. అతి నవీన శైలి, ఉగ్రవాద రాజకీయ సిద్ధాంత ఛాయలు, రాచకొండవారి అనుయాయిత్వం, ఈ రచయిత్రి రచనలలో కానవచ్చే లక్షణాలు.

వాసిరెడ్డి సీతాదేవి గ్రామీణ జీవితాన్ని, ఆధునిక సమాజ నగరీకరణాన్ని సమర్థవంతంగా చిత్రించగల రచయిత్రి. సమత, మట్టిమనిషి, మొదలైన నవలలు ఈమెకు గల సామాజికావగాహనను ప్రకటిస్తాయి.

ఇల్లిందల సరస్వతీదేవిగారు కథారచయిత్రిగా, నవలాకారిణిగా ప్రసిద్ధురాలు. యద్ధనపూడి సులోచనారాణిగారి నవలలు, తరుణులను ఇనుమిక్కుటంగా ఆకర్షిస్తాయి. కౌసల్యాదేవిగారి నవలల్లో స్వాప్నిక జగత్తు అందంగా సాక్షాత్కరిస్తుంది. పరిమళాసోమేశ్వర్ మధ్యతరగతి కుటుంబాల, ఆధునిక యువతీ యువకుల మనస్తత్వాలను తమ నవలల్లో నేర్పుగా చిత్రిస్తున్నారు సి ఆనందారామం చురుకైన శైలితో, భావోద్వేగంతో, ఇతివృత్త వైవిధ్యం కోసం ప్రయత్నిస్తున్న రచయిత్రి. తురగా జానకీరాణి, కోమలాదేవి, అబ్బూరి ఛాయాదేవి, కావలిపాటి విజయలక్ష్మి, ఉన్నవ విజయలక్షి, కొలిపాక రమామణి వేదుల శకుంతల, డి. కామేశ్వరి, పి రామలక్ష్మి, కె రామలక్ష్మి, మాదిరెడ్డి సులోచన. ఈ విధంగా పేర్కొంటూ పోతే, ఇవాల్టి దిన, వార, పక్ష, మాసపత్రికా ప్రపంచాన్ని యథేచ్ఛగా పరిపాలిస్తున్న రచయిత్రీమణు లెందరినో గూర్చి వ్రాయవలసి వుంటుంది. వీళ్ళంతా ఆధునిక సమాజస్వరూపాన్ని, ముఖ్యంగా ఎగువ, దిగువ తరగతులకు సంబంధించిన మధ్యతరగతి కుటుంబాల సమస్యలను, పెళ్ళిళ్ళు, కట్నాలు, తరతరాల నుంచి వస్తున్న కుటుంబ సంప్రదాయాలను కాపాడుకోవటానికి పడే కష్టాలు, ప్రేమలు, ఆర్థికమైన ఇబ్బందులు, స్త్రీలు ఉద్యోగం చేయడంలో వాళ్ళు ఎదుర్కొనే అవాంఛనీయమైన పరిస్థితులు, వర్ణాంతర, కులాంతర వివాహాలు వాటి సాధక బాధకాలు, మొదలైన ఇతివృత్తాలు తీసుకొని నవలలు వ్రాస్తున్నారు. నేటి రచయితపై నేటి సినిమా ప్రభావం కూడా ఉండడంలో ఆశ్చర్యం లేదు.

"లత" తిరుగుబాటు భావాలుగల రచయిత్రి. ఈమె చాలా నవలలు వ్రాసింది. మోహనవంశి, వారిజ, ఎడారిపువ్వులు, మొదలైన నవలలెన్నిటినో ఇతివృత్త వైవిధ్యంతో ఈమె రచించారు. ఈమెగారు వెలువరచే భావాలలోను,