పుట:TELUGU-NAVALA.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుగు నవల

37

నూతనాధ్యాయం సృష్టించినవని చెప్పాలి. శారద(ఆర్. నటరాజన్) రచయితగా స్వయంభువు, బలమైన విత్తనం భూమిని చీల్చుకొని మొక్కగా పైకివచ్చి, ఆకాశాన్ని , తనచుట్టూ వాతావరణాన్ని చూసి విస్తుపోయినట్లు, తానున్న సమాజమనే పాదులోంచి పుట్టిన రచయిత 'శారద', 'అపస్వరాలు' మధ్యతరగతి కుటుంబ జీవితాన్ని అత్యంత సమర్థవంతంగా చిత్రించిన నవల. 'మంచి చెడు' ఆధునిక నాగరికతలోని మంచి-చెడులను, దిగువ తరగతి ప్రజల ఆర్థిక దుస్థితిని, వాళ్ళ జీవిత విధానాలను చిత్రించే నవల.

శంకరమంచి సత్యం, 'రేపటిదారి' అనే మంచి నవలికను వ్రాశారు. రానున్న తరం ఆమోదించి ఆదరించే విలువల ప్రస్తావన యీ నవల.

తాళ్ళూరి నాగేశ్వరరావు, ఎదగనిపువ్వు, ఆకలి-అవినీతి, కొత్త ఇల్లు మొదలైన మంచి నవలలు వ్రాశారు. కొత్త ఇల్లు, పాత కొత్తతరాల భావసంఘర్షణ ప్రతిపాదించే నవల. అవినీతి అనేది ఆకలికి సంబంధించిన సమస్య కాదని, కొందరి జీవితాలలో అది అపరిహార్యంగా ప్రవేశిస్తుందని ఆయన ఆకలి-అవినీతిలో సమర్థవంతంగా చిత్రించాడు.

'రాఘవ' శిఖరాలు - సెలయేళ్ళు, పరాధీన, వంటి నవలలు చాలా రచించాడు. ఈ రచయిత వర్ణనలు విలక్షణంగా వుంటాయి. ఉషఃశ్రీ, మథురాంతంకం రాజారాం, ఇటీవల నవలికలు ప్రకటించినా కథారచయితలుగా వాళ్ళు సుప్రసిద్ధులు.

వాసమూర్తి కోనేరు-సెలయేరూ, ఇహపరాలు, మంచి నవలలు. ఆదివిష్ణు, మంచి నాటక రచయితగా, కథారచయితగా ప్రసిద్ధుడైనా 'సగటు మనిషి' అనే మంచి నవలను కూడా ఇటీవల ప్రకటించారు. కొలకలూరి ఇనాక్ 'అనాథ' 'ఎక్కడుంది ప్రశాంతి'? మొదలైన మంచి నవలలు వ్రాశాడు. ఆనదల జీవితాలు, అడుగుపొరల మనుషులకు ఎదురయ్యే అన్యాయాలు ప్రతిభావంతంగా ఈ రచయిత చిత్రించగలడు. డా. అరిపిరాల విశ్వం ఇటీవల కొన్ని మంచి నవలలు ప్రకటించారు. కవితాత్మకంగా వుంటుంది వీరి శైలి. తాత్త్వికగవేషణ, మానవత్వపు లోతులను పరిశీలించడం, భావోద్విగ్నత వీరి రచనలలో కానవస్తాయి

రుద్రాభట్ల నరసింగరావు చాలా ఆశలు రేకెత్తించిన రచయిత. అయితే ఆయన పెద్ద నవలేమీ వ్రాయలేదు. ఆయన వ్రాసిన చిన్న నవలిక ఆదర్శ శిఖరాలు ఆయన ప్రతిభను చాటుతున్న ది.