పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

189


కన్నతండ్రికి భంగకార్యం బిడెడు మామ
        తెలిసి కూతురును వర్తించునన్న
ప్రజలనోటను రద్దిపాలౌ వదినగారు
        సతతజాతివిరోధి సంగ డీఁడు
మధుపానవివశదుర్మదులు బంటుబలంబు
        పథ మెఱుంగక మండిపడియె దీవు


తే.

యిట్టి నీవంగడంబుపే రెత్తియైన
పిన్నపెద్దల కిక నోటబెట్టదగునె
మానినులకెల్ల తలవంపులైన బ్రతుకు
గోర నేటికి నీరూప మార మార.

145


చ.

నెఱి విషజాతులంపగమి నీటులొ జాడలుదీయు టెక్కెమున్
మొరసెడి నారి నల్లగమిమూఁక తునింగిన మొల్చువిల్లు నొం
డొరులకు గానరాని తనువుంగొని పాంథమనోధనంబు లీ
కరణి రహించు తస్కరశిఖామణి వీవె కదా మనోభవా!

146


సీ.

ఒకపాటివాఁడైన చికిలిబాకు ధరింప
        చివురుటాకును బూన సిగ్గు గాదె
హేనుఁడైన తురంగ మెక్కఁగా చిల్కత
        త్తడి నీవు గొన కొంచెదనము గాదె
కొఱగానివాఁడైన కోదండము ధరింప
        లలి తుంటవిలు దాల్ప లజ్జ లేదె
తనువులు ప్రాణు లందథికుండఁగా ననం
        గుడవౌచు బ్రతుకుట కొఱత గాదె


గీ.

కాన గతిలేని యభిమానహీనవృత్తిఁ
బతుల నెడబాయు సతులపై యమలగతుల
మెత్తవిరిగుత్తికత్తుల నొత్తఁదగునె
యమలితాభంగశృంగార హరికుమార.

147