246
స్వీయ చరిత్రము.
నుండిన కొమ్ము రామలింగశాస్త్రి గారికి వ్రాసి యిల్లొకటి యద్దెకుపుచ్చుకొని, మాపాఠశాల కేప్రిల్ నెల 20 వ తేదినుండి వేసవికాలపు సెలవు లియ్యఁగానే యియ్యవలసిన వారికందఱికిని మెయి నెల జీతములు సహితము ముందుగానే యిచ్చివేసి నాభార్యతోను మేము పెంచుచుండిన శ్రీరాములుగారి శిశువుతోను బైలుదేఱి నరసాపురము వెళ్లితిని. గోగులపాటి శ్రీరాములుగారు వితంతు వివాహము చేసికొనునప్పటికి ప్రధమకళత్రమువలన నాలుగుమాసముల పురుష శిశువుండెను. నాయందలిగౌరవముచేత తండ్రి యాబాలునకు నా పేరెపెట్టెను. ఆశిశువును మాయొద్దనుంచుకొని పెంచి పట్టపరీక్షయందు కృతార్థుఁడగు వఱకును నే నే విద్య చెప్పించితిని. నాదెప్పుడును పనిలేక యూరకకూరుచుండెడు స్వభావము గాదు కనుక నరసాపురములో నున్నప్పుడు సహితము వితంతు వివాహపక్షమున పనిచేయుచు నక్కడి సెంట్రల్ హైస్కూలులో వితంతు వివాహమునుగూర్చి యొక యుపన్యాసమువ్రాసి మెయి నెల 28 వ తేదిని చదివితిని. నేను నరసాపురము వెళ్లఁగానే బందరునుండి రాజమహేంద్రవరము వెళ్లి తిరిగివచ్చిన యీక్రింది యుత్తరము నాకందెను. -
"ఆంతరంగికము.
మశూలా.
16 వ ఏప్రిల్ 84.
నాప్రియమైన అయ్యా !
ఏవిషయమునుగూర్చియైనను మీపేర వ్రాయుటకు నేను కలముపట్టిన దిదియే మొదటిసారియైనను మనయసహాయలైనవితంతువులకు దుఃఖమోచనము చేయుటకయి మీరు పూనినపదమునం దాదరము కలవాఁడనన్న చిన్న హేతువుచేత మిమ్ము "ప్రియమైన" యను విశేషణముతో సంబోధించెడు స్వాతంత్ర్యమును వహించుచున్నాను.
నాయాదరము నింతకుముందే తెలుపనందుకు మీరు నన్ను క్షమింతురని కోరుచున్నాను. ఈపట్టణములో నేదైన వితంతువివాహము జరపఁ