188
స్వీయ చరిత్రము.
పయియుత్తరములో విధింపఁబడి యంగీకరింపఁబడినట్టు చెప్పఁబడిన షరతులలో ప్రధానమైనది రామకృష్ణయ్యగారిఁకముందు వితంతువివాహముల నిమిత్తమయి ధనసాహాయ్యము చేయకుండుట. శ్రీరాములనుగూర్చి చెప్పఁబడినయంశము ముందు వివరింపఁబడును. ఇటువంటి కష్టకాలములయందు సహితము మమ్ము చేయివిడువక రహస్యముగా మాకు బహువిధముల తోడుపడినవారుసహితము కొందఱుండిరి. అట్టివారిలో ప్రథమగణ్యులయి న్యాపతి సుబ్బారావుపంతులుగారు మాకారంభదశనుండియు నాలోచనచెప్పుచు సర్వవిధముల సాయముచేయుచుండిరి. అట్టి సుబ్బారావు పంతులుగారు రామకృష్ణయ్యగారిని ప్రాయశ్చిత్త కర్మమునుండి మరలించు సందేశమును వహించి మాపక్షమున కాకినాడకుఁ బోయి వారితో మాటాడి మాకిట్లు వ్రాసిరి -
"రామకృష్ణయ్యగారీ రాత్రి బైలుదేఱుచున్నారు. రేపు పెద్దాపురములో నిలిచి మఱునాఁడు రాజమహేంద్రవరములో నుండెదనని యాయన చెప్పుచున్నాఁడు. ప్రాయశ్చిత్తము చేయించుకొనుటకుముందు మిమ్మిద్దఱిని చూడవలెనని నేనాయనయొద్దనుండి యొక్క వాగ్దానమును గైకొన్నాను.