పుట:SuprasiddulaJeevithaVisheshalu.djvu/92

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిలక్ ప్రజలలో రాజకీయ చైతన్యంతో పాటు మన ధర్మంపట్ల శ్రద్ధాసక్తులను ప్రబోధించాడు. శివాజీ ఉత్సవాలను, గణపతి ఉత్సవాలను సంఘటితం కావించి ప్రజలలో నవచైతన్యాన్ని రేకెత్తించాడు.

1896లో మహారాష్ట్ర ప్రాంతంలో కరువు వ్యాపించినపుడు, ఆ తర్వాత ప్లేగ్ వ్యాధి వేలాది ప్రజలను పొట్టన పెట్టుకొన్నపుడు తిలక్ సాగించిన ప్రజాసేవా కార్యక్రమాలు చిరస్మరణీయమైనవి. తిలక్ గాంధీజీతో రాజకీయంగా విభేదించాడు. కాని స్వాతంత్ర్య సమరంలో ఒకే బాటపై నడిచారు.

జీవితాంతం అలుపెరుగక పోరాడిన లోక మాన్యుడు 1918 ఆగష్టు ఒకటవ తేదీన రాత్రి గం. 12.40 ని.లకు ప్రశాంతంగా కన్ను మూశాడు. గాంధీజీ తన ' యంగ్ ఇండియా ' పత్రికలో తిలక్ కు శ్రద్ధాంజలులర్పిస్తూ "తిలక్ మహాశయుడు సాధించిన అనురాగం, పలుకుబడి మన కాలంలో మరే నాయకుడు సాధించలేదు. ఆయన ప్రజలకు ఆరాధ్య దైవం, మానవులలో మనోన్నత మూర్తి అస్తమించాడు. భారతదేశమంతటికీ లోక మాన్యుడైన తిలక్ మహాశయుని ధైర్యం, నిరాడంబరత్వం, త్యాగం, మాతృదేశాభిమానం మనమలవరచుకొని ఆయనకు మన హృదయంలో చెక్కుచెదరని స్మృతి చిహ్మం నిలుపుకొందాం " అన్నాడు గాంధీజీ.

తిలక్ భౌతిక కాయాన్ని స్వయంగా భుజంపై మోయాలని గాంధీజీ ముందుకు వెళ్ళినపుడు " బ్రాహ్మణులు మాత్రమే " అతని శవవాహకులుగా వుండాలన్నారు. ప్రజా సేవకుడికి ఆ నియమాలు వర్తింపవని గాంధీజీ శవవాహకుడయ్యాడు.

తిలక్ సంస్కరణవాదియైన మహామానవుడు పదునారేళ్ళ వయసు పూర్తి అయిన తర్వాతనే మహిళలకు వివాహం జరపాలని, 40 ఏళ్ళ వయసు మీరిన పురుషులు వివాహం చేసుకోదలచిన వితంతువులనే వివాహమాడ వలెనని, వరకట్నం తీసుకోరాదని, మధ్య పానం విసర్జించాలని, సంఘసేవకులు తమ ఆదాయంలో ఒక శాతాన్నైనా సంఘసేవకు వినియోగించాలని బోధించాడు.

లోకమాన్యుడు 30 ఏళ్ళపాటు కేసరి, మరాఠా పత్రికలను నిర్వహించి భారతీయ పత్రికోద్యమానికి నవోత్తేజం కలిగించాడు. ప్రజా సమస్యల నిరూపణకు పత్రికలు వేదికలు కావాలన్నాడు. పత్రిక ఎట్టి పరిస్థితులలోనైనా సకాలంలో వెలువడాలన్నది ఆయన లక్ష్యం.

ఒకమారు ' కేసరి ' పత్రిక సంపాదకీయం వ్రాస్తుండగా, కొడుకు ప్లేగు వ్యాధికి గురై మరణించాడు. ఏమాత్రం చలించని తిలక్ పత్రికను సకాలంలో వెలువరించాడు. కఠోరమైన నియమ పాలకుడాయన. 36 గంటలు నిర్విరామంగా పనిచేస్తూ పత్రికను వెలువరించిన రోజులెన్నో ఆయన జీవితంలో. అచ్చు పనిలో అన్ని విభాగాలపై ఆయనకు పట్టు వుండేది.

తిలక్ జైలులో వున్నప్పటికీ పత్రిక సకాలంలో వెలువడుతుండేది. ఉపసంపాదకులకు ఆయన ఇచ్చిన శిక్షణ అట్టిది. అది అమూల్యం. తమ పత్రిక ఉపసంపాదకులనుద్దేశించి