సు మి త్ర చ రి త్ర ము 5
ఈ యుత్తమకాంతయొక్క సంతాపదినములు నాటితో బ్రారంభ మాయెను. సుమిత్రుఁ డెంతప్రార్థించినను నిలువ నొడబడనివాడు మంజువాణియొక్క మృదుమధురవాక్యములచే మనసు కరగినవాడై దీనత్వముతో వేడికొనునామె ప్రార్థనను త్రోచిపుచ్చలేక చంద్రవర్మ మఱికొన్ని వారములవరకును తన ప్రయాణమును మానుకొనెను. తన మిత్రునియొక్క సుగుణసంపదయును తన యిల్లాలియొక్క సత్స్వభావమును జిరకాలానుభవమువలన లెస్సగా దెలిసియున్నవా డయ్యును, వేళావిశేషముచేత సుమిత్రుడు భార్యయందును మిత్రుని యందును నిగ్రహింపరాని యసూయ గలవాడయ్యెను. పెనిమిటియొక్క యాజ్ఞచేత నాతని ప్రీతిని బడయుటకొఱకే యాకాంత దినదినమును చంద్రవర్మ విషయ మయి చూపుచు వచ్చిన శ్రద్ధయంతయు దురదృష్టవంతు డైన యానృపాలుని యొక్క మనోవేదనాభివృద్ధికే తోడుపడసాగెను. సుమిత్రుడు పూర్వము ప్రియకాంతయెడ నెంతప్రేమగలవాడును ప్రియ మిత్రునియెడ నెంతదయ గలవాడు నయి యుండెనో యిప్పు డంతయీర్ష్యయు నిర్దయత్వమును గల ఘోరరాక్షసుడుగా మాఱి, తనసభికులలో నొకఁడగు బహుమానును బిలిపించి, రహస్యముగా నాతనితోఁ దనకు గలిగిన యవమానమును జెప్పి, చంద్రవర్మను విషప్రయోగము చేసి చంపుమని యుత్తరువు చేసెను.