నానవాలుపట్టుటకు వలనుగాకుండ మాఱువేషము వేసికొని యుండుటచే రాజును వారిరువురసంభాషణములు వినబడునంత సమీపమునకు వెళ్ళియుండెను. ఆ చిన్నది తనకొమారునితో మాటాడిన వాక్యములు ప్రౌఢములు కాకపోయినను మిక్కిలి మధురములుగా నున్నందున రాజునకుగలిగిన యద్భుతమునకు బరిమితిలేదు. అప్పుడు రాజు బహుమానునివంక జూచి "హీనజాతివారిలో నింత సౌందర్యవతిని వినియు గనియు నుండలేదు; నేను కనిపెట్టినంతవఱకు ఈ చిన్న దాని మాటలలోను ప్రవర్తనలోను హీనజాతియని యూహించుటకుఁ దగిన యాధార మేదియుఁ గనబడలేదు." అని చెప్పెను. "నిస్సంశయముగా నీకన్య గోపకులమునకెల్లను రాణియైయుండు" నని బహుమానుఁడు మాఱు పలికెను.
అప్పుడు రాజు ముసలిగొల్ల వానికడకు వచ్చి "ఓయీ! నీ కొమార్తెతో మాటలాడుచున్న యా చిన్న వాఁడెవ"డని యడిగెను. "అతనిపేరు కందర్పుడు. తనకొమార్తెమీద ప్రేమ గలదని చెప్పుచున్నాడు; అతనికి నాకూతురును వివాహము చేసికొనుయోగముండెనేని ఆతఁ డెప్పుడును కలలో నైన నెదురు చూడని లాభముతోడగూడ నామెరాగలదు" అని, అమ్మగా మిగిలిన ప్రమతియొక్క యాభరణములని భావమునం దుంచు కొని వాఁడు పలికెను. ఆగొల్లఁ వాడు నాఁడట్లు నగలుకొన్ని విక్రయించి పశువులమందలను కొన్న తరువాత, శేషించిన నగ