హితము చెప్పినకొలఁదిని రాజున కంతకంత కాగ్రహము బలిసి యామెను దన యెదురనుండి కొనిపొమ్మని యాపె పెనిమిటితో నుత్తరువుచేసెను. మిత్రవింద వెళ్లునపుడు పిల్లది యొంటిగా నున్నప్పుడు శిశువుయొక్క యసహాయతను జూచిననైన నొకవేళ జాలిపుట్టునేమోయని యాబిడ్డను తండ్రి కాళ్ళసమీపముననే దిగవిడిచి పోయెను. ఆమెకొలువు బాసి వెళ్ళినతోడనే దయాశూన్యు డయిన యాతండ్రి వక్రచిత్తుని బిలిచి "నీవీబిడ్డను గొనిపోయి సముద్రమునుదాటి నిర్జనవనములో దిగఁ బెట్టి ర"మ్మని యాజ్ఞాపించెను.
వక్రచిత్తుఁడు ఉత్తమాంగనయైన మిత్రవిందవంటివాఁడు కానందున తనస్వామియాజ్ఞాను శిరసావహించి యానిమిషముననే యొకపడవనెక్కి, ముందుగా నెక్కడ నిర్మానుష్యమైన యడవి కనబడునో యక్కడనాచిన్న దానిని పాఱవేయవలెనను నుద్దేశముతో బయలుదేఱెను. రాజు రాణిమీద మహాకోపముతో నున్నవాడుకాబట్టి, దేవతావాక్యమును దెచ్చుటకయి వెళ్ళియుండిన సత్యసారుడును చతురాస్యుడును వచ్చుటకైన గనిపెట్టుకొనియుండక, యీలోపుగానే కన్నకూతురు గతివిని మూర్ఛపోయి తేఱి కన్నకడుపు దహించుకొనిపోవ రాణి విలపించుచుండఁగా తనసభలోని ప్రముఖుల యొక్కయు మంత్రులయొక్కయు సమక్షమున బహిరంగముగా భార్యనేరమును విచారణ చేయుటకయి యామెను రచ్చకీడ్చెను. ఆమె చేసిననేరమును విమర్శించుట కయి దేశములోఁగల గొప్పవా