పుట:Srivemanayogijiv00unknsher.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మంతయు నాగ్రహము లేదు." అని హృదయము చిక్కబట్టి పలికెను.

"నీవతిశాంతుడవు యోగ్యుడవు. నాకింతటి మహోత్కృష్టత నొసంగిన కరుణార్ద్రమూర్తివి. నిన్ను నేనేమని వర్ణింపగలవాడను. నేనునీయెడ ద్రోహముచేసితి ననుటనిజము, ఇంతటిదోషమునుకు నేనొక పరిహారమును తెలిసికొంటిని. అయ్యది ప్రాయశ్చిత్తములలోని కెల్లమేటి అదియెయ్యది యనియెదవేమొ? అదియే నేనుముందుచెప్పిన గ్రంథనిర్మాణము, దానివలన లోకంబులకును లోకులకును జ్ఞానము చేకూరును. కుత్సితమతములు రూపడగి పోగలవు. అందు మనయిద్దరిపేర్లును వెలయగలవు. ఇక నాకనుజ్ఞ నీయ వేడెదను." అనిపలికి యభిరాముని చేత ఈషద్వికసిత నేత్రాంచలప్రసారముల ద్వారా సెలవుగైకొని అదిమొదలుకొని ఈవేమనగారు చివర "వేమ!" "అభిరామ వేమ" అని వచ్చునట్లుగా గ్రంథనిర్మాణమును చేయబూనికొనిరట; ఇది వేమనగారు గ్రంథముచేయుటకు కారణమునుగా మనవారలు చెప్పెడి యొకకథ, ఇందలి సత్యాసత్యనిర్ణయమునకు పాఠకులే ప్రమాణభూతులు కావున దీనిని గుఱించి విశేషముగా జెప్పనక్కఱలేదు అని తలంచుచున్నాము.