పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/303

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

131

లైన సర్వకార్యంబులందు, సత్త్వాది రూపంబులం బ్రవేశించియుండుదు. భౌతికంబులు భూతంబులయందుఁ గారణావస్థం బొందు చందంబున భూత భౌతికంబులు గారణావస్థం బొందిన నాయందు నభివ్యక్తంబులై యుండవు. సర్వ దేసంబులయందు సర్వకాలంబులయందు నేది భోధితంబై యుండు, నట్టిదే పరబ్రహ్మ స్వరూపంబు, తత్త్వం బెఱుంగ నిచ్ఛయించిన మిముఁ బోఁటి వారలీ చెప్పినది మదీయ తత్త్వత్మకంబైన యర్థంబని యెఱుంగదురు. ఈ యర్థం బుత్కృష్టం బైనయది. ఏకాగ్రచిత్తుండవై యాకర్ణించి భవదీయ చిత్తంబున ధరియించిన నీకు సర్గాది కర్మంబులయందు మోహంబు చెందకుండెడి. అని భగవంతుండైన పరమేశ్వరుండు చతుర్ముఖున కాజ్ఞాపించి నిజలోకంబుతో నంతర్ధానంబు నొందె. అని చెప్పి శుకుండు వెండియు నిట్లనియె. (252)


సీ. అవనీశ బ్రహ్మ యిట్లంతర్హితుండైనఁ బుండరీకాక్షుని బుద్ధి నిలిపి

యానందమును బొంది యంజలి గావింవి తత్పరిగ్రహమునఁ దనదు బుద్ధి

గైకొని పూర్వప్రకారంబునను సమస్తప్రపంచం బెల్లఁదగ సృజించి

మఱియొకనాఁడు ధర్మప్రవర్తకుఁ డౌచు నఖిల ప్రజాపతి యైన కమల


తే. గర్భుఁ డాహితార్థమైకాక సకల, భువనహిత బుద్ధి నున్నత స్ఫురణ మెఱసి

మానితంబైన యమ నియమముల రెంటి, నాచరించెను సమ్మోదితాత్ముఁడగుచు. (253)


వ. అ య్యవసరంబున, (254)


క. ఆ నళినాసననందను, లైన సనందాది మునుల కగ్రేసరుండున్

మానుగఁ బ్రియతముఁడును నగు, నా నారదుం డేఁగుదెంచె నబ్జజు కడుకున్. (255)


క. చనుదెంచి తండ్రికిం బ్రియ, మొనరఁగ శుశ్రూషణంబు లొనరిఁచి యతుఁడున్

దనదెసఁ బ్రసన్నుఁడగుటయుఁ, గని భగవ న్మాయఁ దెలియఁగా నుత్సుకుఁడై. (256)


సీ. అవనీశ! నీవు నన్నడిగినపగిది నతఁడు దండ్రి నడుగఁ బితామహుండు

భగవంతుఁ డాశ్రిత పారిజాతము హరి గృపతోడఁ దన కెఱిఁగించినట్టి

లోకమంగళ చతుః శ్లోక రూపంబును దశ లక్షణంబులఁ దనరు భాగవతము

నారదున కున్నతిఁ జెప్పె నాతఁడు చారు సరస్వతీ తీరమునను