పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

44


తే.గీ. మీ జగన్మోహనాకృతి నిచ్చగించి, పంచశర భల్లజాల విభజ్యమాన

వివశ మానసమై వల్లవీ సమూహ, మితని యధరామృతముఁ గ్రోలు నెల్ల ప్రొద్దు. (1-238)


ఉ. ఈ కమలాక్షు నీ సుభగు నీ కరుణాంబుధిఁ బ్రాణనాథుఁ గాఁ

జేకొని వేడ్కఁ గాపురము సేయుచు నుండెడి రుక్మిణీ ముఖా

నేక పతివ్రతల్ నియతి నిర్మల మానసలై జగన్నుతా

స్తోక విశేష తీర్థములఁ దొల్లిటి బాముల నేమి నోఁచిరో ! (1-239)


వ. అని యిట్లు నానావిధంబులైన పురసుందరీ వచనంబు లాకర్ణించి కటాక్షించి నగుచు నగరంబు వెడలె. ధర్మజుండును హరికి రక్షకంబులై కొలిచి నడువం జతురంగంబులం బంపిన దత్సేనా సమేతులై తన తోడి వియోగంబునకు నోర్వక దూరంబు వెనుతగిలిన కౌరవుల మఱలించి, కరుజాంగల, పాంచాల, శూరసేన, యామున భూములం గడచి బ్రహ్మావర్త, కురుక్షేత్ర, మత్స్య, సారస్వత, మరుధన్వ, సౌవీరాభీర విషయంబు లతిక్రమించి తత్తద్దేశ నివాసు లిచ్చిన కానుకలు గొనుచు నానర్త మండలంబు సొచ్చి పద్మబంధుండు పశ్చిమసింధు నిమగ్నుండైన సమయంబునఁ బరిశ్రాంతవాహుండై చని చని. (1-240)

అధ్యాయము - 11

మ.జలజాతాక్షుడు శౌరి డగ్గఱె మహాసౌధాగ్ర శృంగారకన్

గలహంసావృత హేమపద్మ పరిఘా కాసారకన్ దోరణా

వళి సంఛాదిత తారకన్ దురు లతా వర్గానువేలోదయ

త్ఫల పుష్పాంకుర కోరకన్ మణిమయ ప్రాకారకన్ ద్వారకన్ (1-241)


వ.ఇట్లు తన ప్రియపురంబు డగ్గఱి. (1-242)