పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26

మ. వినుమీ సృష్టి లయంబు నొంది యుగముల్ వెయ్యైన కాలంబు యా

మినియై పోయెడిఁ బోవఁగాఁ గలుగుఁ జూ మీఁదం బున: సృష్టి యం

దు నిరూఢ స్మృతితోడఁ బుట్టెదవు నిర్దోషుండవై నా కృపన్

ఘనతం జెందెదు శుద్ధ సాత్త్వికులలో గణ్యుండవై యర్భకా ! (1-127)


వ. అని యిట్లాకాశంబు మూర్తియు, ఋగ్వేదాదికంబు ని:శ్వాసంబునుగా నొప్పి సర్వ నియామకంబైన మహాభూతంబు వలికి యూరకున్న, నేనును మస్తకంబు వంచి మ్రొక్కి, తత్‌కరుణకు సంతసించి, మదంబు దిగనాడి, మత్సరంబు విడిచి, కామంబు జయించి, క్రోధంబు వర్జించి, లోభమోహంబులు వెడలనడిచి, సిగ్గు విడిచి, యనంత నామంబులు పఠియింపుచుఁ బరమభద్రంబులైన తచ్చరిత్రంబులఁ జింతింపుచు, నిరంతర సంతుష్టుండనై (కృష్ణుని బుద్ధి నిలిపి నిర్మలాంత:కరణంబు తోడ విషయ విరక్తుండనై) కాలమున కెదురుసూచుచు, భూమిం దిరుగుచు నుండ నంతఁ గొంత కాలంబునకు మెఱుము మెఱసిన తెఱంగున మృత్యువు తోఁచినం బంచభూతమయంబై కర్మస్వరూపంబైన పూర్వదేహంబు విడిచి, హరికృపావశంబున శుద్ధసత్త్వమయంబైన భాగవత దేహంబు సొచ్చితిని. అంతం ద్రైలోక్యంబు సంహరించి ప్రళయకాల పయోరాశి మధ్యంబున (శయనించు) నారాయణమూర్తియందు నిదురవోవ నిచ్చగించు బ్రహ్మని:శ్వాసంబు వెంట నతని లోపలం బ్రవేశించితిని. అంత సహస్రయుగ పరిమితంబైన కాలంబు చనిన లేచి లోకంబులు సృజియింప నుద్యోగించు బ్రహ్మ ప్రాణంబుల వలన మరీచిముఖ్యులగు మునులు, నేనును జనియించితిమి. అందు నఖండిత బ్రహ్మచర్యుండనై యేను మూఁడు లోకంబుల బహిరంతరంబులయందు మహావిష్ణుని యనిగ్రహంబున నడ్డంబు లేక యీశ్వరదత్తయై బ్రహ్మాభిరంజకంబులైన సప్తస్వరంబులును దమయంతన మ్రోయుచున్న యీ వీణాలాప రతిం జేసి నారాయణ కథాగానంబు సేయుచుఁ జరియింపుచుండుదు. (1-128)


ఆ.వె. తీర్థపాదుఁడైన దేవుండు విష్ణుండు, తన చరిత్ర మేను దవిలి పాడఁ

జీరఁబడ్డవాని చెలువున నేతెంచి, ఘనుఁడు నా మనమునఁ గానవచ్చు.(1-129)


కం. వినుమీ సంసారంబను, వననిధిలో మునిఁగి కర్మవాంఛలచే వే

దనఁ బొందెడువానికి వి, ష్ణుని గుణవర్ణనము తెప్ప సుమ్ము మునీంద్రా ! (1-130)