పుట:Shriiranga-mahattvamu.pdf/355

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

200

చతుర్థాశ్వాసము


చ.

మనుజవరేణ్యుఁ డిట్లను రమావరదేవకిరీటకోటినూ
తనమణిదీప్తివిస్ఫురితతావకదివ్యపదాంబుజాతముం
గనుగొనునట్టి భాగ్యమునకంటె విశేషవరంబు లెవ్వి నా
జని సఫలత్వమొందెఁ గలుషంబు లడంగెఁ గడంగె పుణ్యముల్.

236


వ.

అని పలికి యారాజపంచాననుండు పాంచరాత్రాగమప్రపంచితవిధానంబున
సావధానమానసుండై యాభోగితల్పు ననల్పభవ్యదివ్యోపచారంబులఁ బూజించి
పునఃపునఃప్రణామంబు లాచరించి, తన్ముఖారవిందలావణ్యమధువిలోలంబు
లైన నిజలోచనమధుపంబుల నెట్టకేలకు మగుడ దిగిచికొని యనంతవైభ
వాభిరామంబగు నారంగధామంబు వెడలి ప్రతిహరపాలకులగు దివ్యపురుషుల
నవ్యమణిభూషణాంబరాదిసమర్పణంబుల సంతర్పితులఁ గావించి విమతవిహగ
శ్యేనుండగు విష్వక్సేనునికడ కరిగి, ససేనుండై, తదీయపార్శ్వభాగంబులఁ
గొలిచి గగనమండలంబున నాఖండలుని నీలగిరిశిఖరంబునుబోలె నుద్దామం
బగు తద్దామంబు వీక్షించి సకలసాధుజనోపాస్యుండగు కశ్యపుఁ గనుంగొని.

237


క.

సన్నుతమేచకజలధర
సన్నిభరుచి గలిగి గగనచరపధమున స
ర్వోన్నతమై యొకధామం
బున్నది యది యెట్టిదనుచు నుత్సుకమతియై.

238


చ.

అడిగిన నన్నరేంద్రునకు నమ్మునిపుంగవుఁ డిట్లనున్ ముదం
బడగ ననంతశక్తియుతుఁడై జగదాత్మకుఁడైన చక్రి యె
ప్పుడు వసియింప నిమ్మగుచుఁ బోల్చిన యమ్మహనీయధామముం
బుడమి ఫణాగ్రభాగమునఁ బూనినశేషునిగా నెఱుంగుమీ.

239


మ.

అతిరమ్యంబగు తల్పమై, సతతలీలావాసమై, రత్నసం
గతసింహాసనమై. పరిస్ఫురితముక్తాఛత్రమై, సత్ర్పభా
తతదివ్యాశుగమై, మనోహరపదత్రాణంబులై, చక్రి నం
చితలీలం భజియించికాదె కనియెన్ శేషుండు శేషత్వమున్.

240


తే.

జ్ఞానశక్తిబలామితైశ్వర్యవీర్య
తేజములు వొల్చు నతనికి నైజ మగుచు,