పుట:Shriiranga-mahattvamu.pdf/315

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

చోరకులు, కల్లుఁ ద్రావెడివారు మఱియు
బహువిధము లైనదుస్తరపాతకములు
చేసినట్టి కుశీలురు, చిరవిశుద్ధిఁ
జెంది శుద్ధాత్ములై ప్రకాశింతు రెలమి.

26


వ.

ఇట్టి మహత్త్వంబు గలిగిన రంగధామంబునకుఁ జెంగట ద్విత్రిగవ్యూతిమాత్ర
ప్రదేశస్థితంబగు నశ్వత్థ వకుళామ్రజంబూక బిల్వతీర్థంబులం దతివి
చిత్రంబు లగు పురావృత్తంబులు గల వవి నీకెఱించెద. దత్తావధానుండవై
యాకర్ణింపుము.

27


మ.

సతతానేకమునీంద్రసేవితము, నశ్వత్థాఖ్యతీర్థంబునం,
దతిపుణ్యాధికసద్వివేకఖని సత్యజ్ఞానసంపన్న ని
ర్గతకామాదివికామ మాధవియనంగా నొక్కతన్వంగి స
న్మతి సేసెం దప మంబుమధ్యమున సమ్యగ్వర్జితాహారియై.

28


క.

ఈనెఱి బహుకాలము చనఁ
గా నొకనాఁ డంబరమునఁ గావుఁడు కావుం
డేనొచ్చితిఁ జచ్చితి నను
దీనాలాపంబు లుప్పతిలెఁ గడు దఱచై.

29


తే.

అమ్మహాక్రందనము విని యాత్మఁ గరుణ
దనుక 'వెఱవకు వెఱవకు' మనుచు వదన
వనరుహం బెత్తి యత్తన్విఁ గనియె మింట
కాలభటపీడితాంగ నంగన నొకర్తు.

30


క.

ఆలలనయుఁ దద్వచనము
లాలించె దయాళువైన యప్పుణ్యవతిం
వోలఁగఁ గనుఁగొని వెండియు
నాలోనన క్రిందుఁగాగ నాక్రోశించెన్.

31