పుట:Shriiranga-mahattvamu.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

48

ప్రథమాశ్వాసము


బై మహి నచ్చోటికి మూఁ
డామడ పుణ్యప్రదేశమై విలసిల్లున్.

207


తే.

తక్కు గలుగు గృహాళికిఁ దద్గృహంబు
పావనము విను పురి వల్లె పదియు రెండు
నొక్కటన మద్విమానము లుండెనేని
సాటి యచటు సాలగ్రామ శైలమునకు.

208


క.

ఇల నేచ్చోటు మదర్చన
విలసితపూజోత్సవాదివిరహిత మగునా
నెలవు వెలివాడఁబోలెం
దలఁపఁ గనుఁగొనఁగ ననుచితము సుజనులకున్.

209


మ.

ఇపు డేఁజెప్పిన యీ స్వయంభువులయం దెల్లం గడు న్మేటియై
క్షపితాశేష దురంత దోషచయమై కల్పాంతర స్థాయియై
యపవర్గప్రద యోజనద్వయయుతంబై భవ్యమై, దివ్యమై
విపులశ్రీకర రంగధామ మమరున్ వేదాంతవిఖ్యాతమై.

210


మ.

నరులైనన్ సురలైన దైత్యవరులైనన్ సన్నుతద్వాదశా
క్షరమంత్రైక పరాయణత్వమున నన్ సద్భక్తి సేవించినం
బరమైశ్వర్య సమగ్రభోగ వితతిం బ్రాపించి సర్వోత్తర
స్థిరవైకుంఠపదంబుఁ జెందుదురు ప్రీతిం గర్మనిర్ముక్తులై.

211


క.

పరమ మిది యొకరహస్యం
బరవిందజ వినుము మత్పరాయణు లెందుం
దురితములు పెక్కొనర్చియు
నరుగరు పటుఘోర నారకాధోగతులన్.

212


క.

గోవధ మాదిగఁ గల నా
నావిధ పాతకము లనుదినము మద్భక్తుల్
గావింపుచుందు రేనియు
నీవలఁ దద్దోషచయము నే హరియింతున్.

213