పుట:Shriiranga-mahattvamu.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

40

ప్రథమాశ్వాసము


తే.

నుదధి నావిర్భవించె సముద్యదధిక
దివ్యతేజోవిశేష దేదీప్యమాన
పద్మ గర్భాండ భాండ ప్రచండ మగుచు
మంగళం బైన శ్రీరంగమందిరంబు.

185


శా.

ఆదివ్యాయత నోపజీవు లయి దుగ్ధాంభోధి మధ్యంబునం
బ్రాదుర్భావము నొంది రచ్యుతదయాపాత్రత్వమిత్రుల్ భవ
చ్చేదావాప్తసదాసుఖోదయులు రాజీవప్రభూతేంద్రము
ఖ్యాదిత్యప్రకరార్చనీయు లగు నందాదుల్ మనోజ్ఞాకృతుల్.

186


తే.

వారితోడనె వైకుంఠవాసులై ప్ర
సిద్ధులైన సనందాది సిద్ధమునులు
నమరగంధర్వ కింపురు షాహియక్ష
గరుడ విద్యాధరాదులు గానఁ బడిరి.

187


వ.

అయ్యవసరంబున.

188


సీ.

రావించె నిరవద్య రావ నారచవాద్య
కలిత తుంబురు హృద్యగానవిద్య,
మెఱసెఁ గింకిణిరావమిళితమై దివి దేవ
సతులనర్తన భావగతుల రేవ,
బలసె దివ్యానేక భవ్య స్తవశ్లోక
ముఖరమై యెడలేక మునులమూఁక,
తొరఁగెఁ బై పైఁ బెల్లు తొలువాసనలఁ జల్లు
పరువమై వికసిల్లు విరులజల్లు


తే.

పొరసె నమృతాంబునిధిఁ దేలి పుష్పశాలి
దైవతోద్యానవనకేళిఁ దనరు గాలి
యఖిలకల్యాణమూల మోక్షాలవాల
రంగజననాతి వేల సంరంభవేళ.

189


వ.

అప్పుడు.

190