10
ధృతరాష్ట్రుఁడే యిదియంతయు దనవలననే కలిగిన దని యొప్పుకొని యీక్రిందివిధమున జింతపడియున్నాఁడు-
క. "నా చేసినకీడునఁ గడు
నీచుం డగు నాతనూజు నేరమి నిమ్తై
నోచెల్లె పార్థులకు బు
ణ్యాచారుల కెందు లేని యాపద వచ్చెన్."
విదురసంజయులు పాండవులయరణ్యవాసాదిశ్రమకును, భారతయుద్ధమునకును నీవే కారకుఁడ వని పలుమారు లితనితోఁ జెప్పియున్నారు.
భీష్మద్రోణకర్ణశల్యులలో నొక్కొక్కరు హతు లైనపిదప, వారివారిమరణమును విని మొదట జింతించుచు, దుర్యోధనుని మేలుకొరకును బాండవుల నాశముకొరకును నాపైని యేమి చేసి రని యాతురతతో నీధృతరాష్ట్రుఁడు సంజయు నడుగుచు వచ్చెను. దీనివలన నందరును మడియువరకు దనకుమారునికి జయము గలుగునో యనునాస వదల లే దని స్పష్ట మగు చున్నది.
9. గాంధారి.
ఈయమ ధృతరాష్ట్రునిపట్టమహిషి, మహాపతివ్రత. రెండవమారు జూదమునకయి ధర్మరాజును బిలువనంపుటకు దుర్యోధనునికి వశుఁ డయి ధృతరాష్ట్రుఁడు ప్రాతి గామి యనువానినిఁ