x
మఱియుఁ గొన్ని సందర్భంబుల శ్రీకృష్ణుల విషయమై మన దేశములో వ్యాపించియున్న పురాతన కథలను నవీనులైన పౌరాణికులు సరిగా గ్రహింపఁజాలక పరిహసనీయమగు విధమున వానినిఁ బెంచిరి. మహారాజావారు కాళియమర్దన కథను దీని కుదాహరణముగ నిచ్చియున్నారు. నాగులను నొక జాతి వా రున్నట్లు తెలియకపోవుటచేతగదా నాగశబ్దమును సర్పపరముగా దీసికొని చిత్రమైనకథ నొకదానిని బౌరాణికులు కల్పించిరి. ఇటులనే గాంధారిగర్భము నూరు శకలములైనదనియుఁ, బ్రతిశకలము గొంతకాలము పెంపఁబడిన వెనుక నొక మగశిశువాయె ననియును భారతములో నున్నది. ఈ కథకు మహారాజావారు చేసిన యర్థము సయుక్తికముగ నున్నది
రామాయణ మాదికావ్యమని వాడఁబడుచున్నది. తనకు ముందెవ్వరును సంస్కృతభాషను ఛందోబద్ధముగ రచింపలేదని వాల్మీకి చెప్పియున్నాడు. సంస్కృతభాషా రచితంబులగు సమస్త గ్రంథములలో వేదములు మొదటివను సంగతి యందరు నొప్పు కొనినదే. ఈ వేదములకు ఛందస్సులను నామమున్న సంగతియు నందరికిఁ దెలిసినదియే కదా? వేదములలోనున్న వృత్తములు పురాణకావ్యనాటకాది గ్రంథములలోనున్న వృత్తములకంటె వేరుగానున్న నవి వృత్తములు కావని ఛందోజ్ఞు లెవ్వరైన నన గలరా! కనుక స్పష్టమయిన యిట్టి సంగతిలో వాల్మీకి తానే