పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8వ అధ్యాయము.

మతబోధకులు.

196. ఓమతబోధకుడా! నీకడ అధికారచిహ్నముకలదా? రాజుచేత అధికారమునుపొందిన అల్పసేవకునిమాట సయితము ప్రజలు భయభక్తులతో మన్నింతురు. తన డవాలు బిళ్ళనుచూపి యెట్టిఅల్లరినైనను యతడు మాన్పగలడు. అదేతీరున నీవును మొట్టమొదట భగవదుద్బోధమను అధికారమును సంపాదించుకొనుము. ఈశ్వరాదేశచిహ్నము నీకడలేనంతవఱకును. ఉపన్యాసములందు నీప్రాణమునంతను వ్యయముకావింతువుగాక, సర్వమును వ్యర్ధమేఅగును సుమీ!

197. పుష్పము వికసించి దాని సువాసన గాలిలో ప్రసరించునప్పుడు తేనెటీగ తనంతటతానె వచ్చును. బెల్లమున్నచోటికి చీమలు తమంతటతామెవచ్చిచేరును. ఆతెనెటీగను చీమను యెవరును పిలువనక్కఱలేదు. అటులనే ఒకపురుషుడు పవిత్రవంతుడును పరిపూర్ణుడును అయినప్పుడు వాని జీవితమహిమ యెల్లదిశలను వ్యాపించును. బ్రహ్మదర్శనమునకై వెదకులాడువారెల్ల సహజముగనే వానిచెంత ఆకర్షించ బడుదురు. తనమాటనెవరు విందురాయని దేవులాడుచు యట్టివాడు అక్కడయిక్కడ తిరుగులాడ నక్కఱయుండదు.

198. అనేకులు మంచుగడ్డనుగుఱించి వినియుందురు; కాని చూచియుండరు. అటులనే చాలామంది మతబోధకులు