పుట:Shodashakumaara-charitramu.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ్రంథాకృతి:-ఈకవి దశకుమారచరిత్రమును మనస్సున నుంచుకొని యీ పోడశకుమారచరిత్రమును రచియించెను. కొన్నికథలను కథాసరిత్సాగరాదులనుండి సంగ్రహించి తన కవితాచమత్కృతిచే రసపుష్టిని వర్ణనాధిక్యమును గలిగించి జనమేజయుని రెండవకుమారుని గథానాయకునిగఁ జేసి, అతనికిఁ దోడుగ నతని మంత్రితనయులను, బురోహితపుత్రులను, దండనాథసుతులను, బదేనుగురను గూర్చి కథ సాగించినాఁడు. కావున నందందుఁ గల పోడశరాజకుమారచరిత్ర మనుపేరు చెల్లదు. ఒక్కతావున పోడశనందనచరిత్ర మని యున్నది. దానికి బాధ లేదు.

కవిత్వము నిర్దుష్టమైనది. ఉభయభాషాప్రౌఢి మెఱయుచున్నది. శైలి మంచన కేయూరబాహుచరిత్రమును, జక్కన విక్రమార్కచరిత్రమును, కేతన దశకుమారచరిత్రమును బోలుచుండును. పద్యములు హృద్యములై ధారాశుద్ధి గలవిగా నున్నవి. ఎవ్వరియొద్ద నైన సంపూర్ణప్రతి యున్నచో దయతోఁ బంపి యీ పోడశకుమారచరిత్రమును బూర్ణముగాఁ బ్రకటించుభాగ్యమును వా రాంధ్రసాహిత్యపరిషత్తునకుఁ గల్గింతురుగాక.